SRH vs DC:సూపర్ ఓవర్లో సన్రైజర్స్ హ్యాండ్సప్...కేన్ మామ కిరాక్, వార్నర్ బదులు బెయిర్స్టో వచ్చి ఉంటే..!
చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలో దిగిన హైదరాబాద్ జట్టు ఓపెనర్ బెయిర్స్టో రెచ్చిపోయాడు. అయితే లేని పరుగుకోసం ప్రయత్నించి కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన కేన్ విలయమ్స్సన్ మరోమారు జట్టును ఆదుకున్నాడు. కేదార్ జాదవ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, విరాట్ సింగ్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. అయితే చివరిలో జగదీష సుచిత్ మెరుపులు మెరిపించడంతో సన్రైజర్స్ పుంజుకుంది. కేన్ మామ వీరోచితంగా పోరాడాడు. అయితే సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగియడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.
సూపర్ ఓవర్లో భాగంగా సన్రైజర్స్ జట్టు బ్యాటింగ్కు దిగింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలివిగా అక్సర్ పటేల్కు బంతిని అప్పగించాడు. కెప్టెన్ అంచనాలకు తగ్గట్టుగా అక్సర్ రాణించాడు. సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొలి బంతిని మిస్ చేశాడు. ఇక అక్సర్ వేసిన బంతులను డేవిడ్ భాయ్ ఎదుర్కోవడంలో విఫలమయ్యాడు. ఇక స్ట్రైక్ రొటేట్ చేయడంతో కేన్ మామ అక్సర్ వేసిన బంతిని బౌండరీగా తరలించాడు. మొత్తానికి సైపర్ ఓవర్లో సన్రైజర్స్ 7 పరుగులు చేసింది. అయితే సాధారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్పిన్ను అంత చక్కగా ఆడలేరు. సూపర్ ఓవర్లో విలియమ్సన్కు జతగా వార్నర్ కాకుండా బెయిర్స్టో ఓపెనర్గా దిగింటే మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక 8 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సన్రైజర్స్లానే తడబడింది. సన్రైజర్స్ తరపున రషీద్ ఖాన్ బౌలింగ్ వేయగా... ఆ ఓవర్లో పంత్ బౌండరీకి తరలించాడు. ఇక చివరి రెండు బంతులకు రెండు పరుగులు అవసరం కాగా.. రశీద్ వేసిన బంతిని ఆడబోయి పంత్ వికెట్ల ముందు చిక్కాడు. ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూకు వెళ్లారు.రివ్యూలో కూడా నాటౌట్గా తేలింది. అప్పటికే ఒక పరుగు పూర్తి చేశారు. ఇక చివరి బంతికి ఒక పరుగు చేయాల్సి ఉండగా శిఖర్ ధవన్ కాలుకు బంతి తగిలి వెళ్లడంతో ఆ ఒక్క పరుగు పూర్తి చేసి విజయం ఖాయం చేశారు. దీంతో సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం సాధించింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఓటమిని తన ఖాతాలోకి వేసుకుంది.