పేద పిల్లలకు అత్యున్నత విద్య అవసరం లేదా? 70 ఏళ్ల కిందటే జగన్ వంటి నేత వచ్చివుంటే
శ్రీకాకుళం: అమ్మ ఒడి పథకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టికి నిదర్శనమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రతి పేద విద్యార్థి అత్యున్నత చదువులను అభ్యసించాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన అమ్మ ఒడి కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. సాధారణ కుటుంబానికి చెందిన పిల్లలు అందరిలా అత్యున్నత చదువులను అభ్యసించాలనే కలను తమ ప్రభుత్వం సాకారం చేస్తోందని అన్నారు.
ఆదేశిక సూత్రాల్లో..
నాణ్యమైన విద్యను అందించాలనేది రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో ఉందని, గత ప్రభుత్వాలు దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయాయని చెప్పారు. అక్షరాస్యతలో ఏపీ.. దేశంలో 22వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. దక్షిణాదికే చెందిన కేరళ మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ తేడా ఎందుకు అనే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. 70 ఏళ్ల కిందటే వైఎస్ జగన్ వంటి నాయకుడు ఏపీకి వచ్చి ఉంటే తల్లిదండ్రుల స్థితి, పిల్లల పరిస్థితి ఇలా ఉండేది కాదని ధర్మాన ప్రసాదరావు అన్నారు.
నాణ్యమైన విద్య.. రాజ్యంగ హక్కు
విద్యకు ఇప్పుడు ఇస్తోన్న ప్రాధాన్యత.. 50 ఏళ్ల కిందటే లభించివుంటే ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు అత్యున్నత స్థానంలో ఉండేవని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు, అవగాహన లేని వ్యక్తులు అమ్మఒడిని డబ్బులు పంచే కార్యక్రమంగా విమర్శిస్తున్నారనడంలో అర్థం లేదని చెప్పారు. అట్టడుగు వర్గాల కుటుంబాలకు 75 సంవత్సరాల తరువాత కూడా రాజ్యాంగంలో ప్రసాధించిన హక్కులు పొందలేకపోతే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుందా? అని ప్రశ్నించారు.
అమ్మఒడిపై విమర్శలా?
ఆ దిశగా ఆలోచన చేసిన వైఎస్ జగన్.. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే అమ్మఒడి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారని చెప్పారు. ధనవంతుల పిల్లల తరహాలోనే పేద విద్యార్థులు కూడా చదువుకోవాలనేది ఆయన లక్ష్యమని ధర్మాన అన్నారు. మూడో విడత అమ్మ ఒడి కింద పేద కుటుంబాలకు సాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకమే లేకపోతే తమ తల్లిదండ్రులు తమ పిల్లలను కూలి పనికి పంపించేవారని అభిప్రాయపడ్డారు.
ఉద్ధానం సమస్య పరిష్కారానికి..
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఉద్దానం ప్రాంతంలో శాశ్వత పరిష్కారం కోసం నీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కిడ్నీ వ్యాధులపై అనేక మంది పలు రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. జిల్లాలో 250 కోట్ల రూపాయలతో ఆసుపత్రిని వైఎస్ జగన్ నిర్మిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ పరిపాలన ముందు తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
లిఫ్ట్ ఇరిగేషన్ కోసం..
వైఎస్ జగన్ తీసుకున్న చర్యల వల్ల నేరెడు బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయని ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు లిప్ట్ ఇరిగేషన్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనితో పాటు కోడి రామ్మూర్తి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. మహేంద్ర తనయ ప్రాజెక్టుకు వైఎస్సార్ పునాదివేశారని, దీన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేస్తోన్న జగన్ వెంటే ప్రజలు ఉంటారని అన్నారు.