భారత్ను ముంచినా..తేల్చినా ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోనే: కివీస్ గెలిస్తే..బ్యాక్ప్యాక్ సర్దుకోవాల్సిందే
అబుధాబి: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఓ కీలకమైన మ్యాచ్ ఈ మధ్యాహ్నం ఆరంభం కానుంది. అల్లాటప్పా మ్యాచ్ కాదది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో టీమిండియా తలరాతను తేల్చే మ్యాచ్.. భవిష్యత్ను నిర్దేశించే మ్యాచ్. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సాగే పోరు ఇది. దీనిపైనే ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించాలంటూ కోరుకోని భారత క్రికెట్ ప్రేమికుడు బహుశా ఉండడేమో. న్యూజిలాండ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తేనే.. ఈ టోర్నమెంట్లో కోహ్లీసేన ముందడుగు వేయగలుగుతుంది. లేదంటే.. బ్యాక్ ప్యాక్ సర్దుకోవాల్సి ఉంటుంది.
ఆఫ్ఘన్కు సాధ్యమేనా..?
ఈ మ్యాచ్ ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఆరంభం కానుంది. 3 గంటలకు టాస్ పడుతుంది. నాలుగు మ్యాచ్లల్లో మూడు విజయలతో గ్రూప్ 2లో రెండో స్థానంలో నిలిచింది న్యూజిలాండ్. పాకిస్తాన్పై ఆడిన తొలి మ్యాచ్లో ఓడిన తరువాత బ్లాక్ క్యాప్స్కు ఎదురు లేకుండా పోయింది. రెండో మ్యాచ్లో భారత్ను ఓడించింది.
ఆ తరువాతి రెండింట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మధ్యాహ్నం తనకంటే బలహీనంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను ఎదుర్కొనబోతోంది. జోరు మీదున్న కివీస్ను ఆఫ్ఘనిస్తాన్ ఎంతవరకు కట్టడి చేయగలుగుతుందనే విషయం మీదే కోహ్లీసేన భవిష్యత్ ఆధారపడి ఉంది.
ఆఫ్ఘన్, స్కాట్లాండ్పై విజయాలతో..
టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలు తలకిందులయ్యాయి. సెమీ ఫైనల్స్కు చేరాలంటే మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోర పరాజయాల తరువాత.. రెండు విజయాలను అందుకుంది. ఆప్ఘనిస్తాన్, స్కాట్లాండ్ జట్లను మట్టి కరిపించింది. ఈ రెండు జట్ల మీద భారీ ఆధిక్యతతో గెలవడం వల్ల టీమిండియా సెమీఫైనల్స్ ఆశలు కొంతవరకు సజీవంగా ఉన్నాయి. ఆఫ్ఘన్ను 66 పరుగుల తేడాతో ఓడించింది. స్కాట్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 6.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ రెండూ టీమిండియా సెమీస్ ఆశలకు ఊపిరి పోసినవే.
ఆఫ్ఘన్ గెలిస్తేనే..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండూ.. నాలుగు పాయింట్ల చొప్పున సాధించాయి. ఇందులో నెట్ రన్రేట్ విషయంలో భారత్ కొంత మెరుగ్గా ఉంది. మూడో స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించితే ఆరు పాయింట్లతో న్యూజిలాండ్తో సమానంగా నిలుస్తుంది. భారత్ నమీబియాతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. బలహీనమైన జట్టు కావడం వల్ల టీమిండియా గెలుపు లాంఛనప్రాయమే అవుతుంది. అప్పుడు కివీస్తో సమానంగా ఆరు పాయింట్లను సాధిస్తుంది. నెట్ రన్రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సెమీస్కు చేరుతుంది. దానికి అనుగుణంగా నమీబియాను భారత జట్టు ఓడించాల్సి ఉంటుంది.
న్యూజిలాండ్ గనక గెలిస్తే..
ఆప్ఘనిస్తాన్పై జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్ గనక విజయం సాధించితే.. టీమిండియా పని అయిపోయినట్టే. తట్టా బుట్టా సర్దేసుకోవడమే. భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ రేస్ నుంచి తప్పుకొంటాయి. న్యూజిలాండ్ సెమీస్కు రెండోసారి చేరినట్టవుతుంది. నమీబియాను కూడా ఓడించాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్ చేరాలీ అంటే.. న్యూజిలాండ్ను ఓడించి తీరాలి. ఓడితే మాత్రం తనతో భారత్ సెమీ ఫైనల్స్ అవకాశాలను కూడా నట్టేట ముంచినట్టవుతుంది. తాను ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్లను గెలిస్తే.. బ్లాక్ క్యాప్స్ నేరుగా సెమీస్లోకి ఎంట్రీ అవుతారు. నెట్ రన్రేట్తో పనే ఉండదు.
కివీస్ తుది జట్టు ఇలా..
ఈ మధ్యాహ్నం అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో తలపడబోయే న్యూజిలాండ్ తుది జట్టులో- మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డేవాన్ కాన్వే (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఈష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్ ఆడే అవకాశం ఉంది.