స్వైన్ ఫ్లూ: ఒకరు మృతి, 'వార్తల్లో నిజం లేదు'
హైదరాబాద్: స్వైన్ ఫ్లూ వ్యాధికి ఓ నిండు ప్రాణం బలైంది. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం మంగళవారం ఉదయం ఎమ్. సూర్యప్రకాశ్ అనే వ్యక్తి వచ్చారు. ఆసుపత్రిలో చేరిన 12 గంటల తర్వాత ముక్కు, గొంతు సంబంధింత వ్యాధితో మృతి చెందినట్లు ప్రివెంటివ్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ (ఐపిఎం) తన నివేదికలో ధ్రువీకరించింది.
కేవలం ఒకే ఒక్క రోజులో 10 కొత్త కేసులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు స్వైన్ ఫ్లూ కోఆర్డినేటర్ డాక్టర్ కె. నరసింహులు తెలిపారు. వారందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 82 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 10, తెలంగాణలో 72 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో బుధవారం తెలంగాణ ప్రభుత్వ అధికారులు సమావేశమై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల సహాయం కోరుతూ, వారి దృష్టికి స్వైన్ ఫ్లూ సంక్షోభాన్ని తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
స్వైన్ ఫ్లూ కారణంగా ఎవరూ మరణించలేదు: డి. సాంబశివరావు
ఇక తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కారణంగా ఎవరూ మరణించలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డి.సాంబశివరావు తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాప్తిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ 851 మంది రక్త నమూనాలు పరీక్షించగా, అందులో 81 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. మరణించిన 8 మందికీ స్వైన్ ఫ్లూతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నాయని వివరించారు.
స్వైన్ ఫ్లూ బాధితులు ఆసుపత్రుల నుండి పారిపోతున్నారన్న మీడియా కథనాలు, పిటిషన్ పైన మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. దీని పైన ఫిబ్రవరి 3వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది.
స్వైన్ ఫ్లూ అంటే ఏమిటీ?
స్వైన్ ఫ్లూ అనేది హెచ్1ఎన్1 రకం ఇన్ప్లూఎంజావైరస్. ఇది ఎక్కువగా పందుల్లో ఉంటుంది. పందుల నుంచి పందులకే వ్యాపించే వ్యాధి. క్రమేనా పందుల వద్ద ఉండే వారికి, పనిచేసే వారికి సోకడం ప్రారంభమైంది. మనిషి నుంచి మనిషికి రావడం మొదలైంది.
ఇది గాలి ద్వారా వ్యాపించే పాండమిక్ వైరస్. మొదట మెక్సికోలో కనిపించిన ఈ వైరస్ తర్వాత యూరప్ ఆ తర్వాత మనదేశంలోకి ప్రవేశించింది. ఈ వైరస్ను ఎదుర్కొవడం ఎలాగో మనలోని రోగ నిరోధక శక్తికి తెలియదు. మొదట ఊపిరితిత్తులు వ్యాధులు వస్తాయి. ఆ తర్వాత వైరల్ న్యూమోనియా, రెస్పిరేటరీ పైల్యూర్ జరిగి ప్రాణాంతకం అవుతుంది.
స్వైన్ ఫ్లూ లక్షణాలు:
దగ్గు, జలుపు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి నీరు రావడం, చిన్న పిల్లల్లో వాంతులు విరేచనాలు జరగడం స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్ ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
స్వైన్ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* పై లక్షణాలున్న వ్యక్తి తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి.
* బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మూతికి మాస్క్ ధరించాలి.
* పై లక్షణాలున్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా, టేబుల్ మీద కాని, వస్తువలు మీదకాని తుంపరలు పడినప్పుడు చేతుల ద్వారా వేరే వారికి సంక్రమిస్తాయి.
* చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
* రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి ఈ వ్యాధి వేగంగా సోకే అవకాశం ఎక్కువ.