చిన్నారిని చంపింది ఎవరో కాదు?: కేవలం వేలు కొరికిందన్న కసితోనే ఘాతుకం..
హైదరాబాద్: చిన్నారుల్లోనూ నేర ప్రవృత్తి పెరుగుతోందా?.. చిన్న చిన్న కారణాలకే నేరాలు చేస్తున్నారా?.. హైదరాబాద్ జలవిహార్ సమీపంలో జరిగిన ఓ సంఘటన ఇదే అనుమానాలను రేకెత్తిస్తోంది. చిన్నపాటి కారణానికే ఓ 11ఏళ్ల బాలిక మరో చిన్నారిని పొట్టనబెట్టుకుంది. పైగా కిడ్నాప్ అంటూ ఓ కట్టు కథ అల్లింది. పోలీసులు సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయడంతో అప్పుడు అసలు విషయం బయటపడింది.

ఇంతకీ ఏమైంది?:
హైదరాబాద్ జలవిహార్ సమీపంలో ఉన్న గుడిసెల ప్రదేశంలో ఇటీవల అక్షర అనే చిన్నారి ఇటీవల అదృశ్యమైంది. దీనిపై అక్కడి చిన్నారులను ఆరా తీయగా.. 11ఏళ్ల ఓ బాలిక ఎవరో వ్యక్తి ఆమెను ఎత్తుకెళ్లాడని, ఎత్తుగా ఉన్నాడని, చేతిలో కత్తి ఉందని పోలీసులతో చెప్పింది. దీంతో పోలీసులు ఆ చిన్నారి మాటల ఆధారంగానే దర్యాప్తు మొదలుపెట్టారు.

ఎక్కడా దొరకని ఆచూకీ:
చిన్నారి చెప్పిన విషయాల ఆధారంగా బేగంపేట, జలవిహార్ పరిసర ప్రాంతాలు, నాంపల్లి రైల్వేస్టేషన్, హుస్సేన్ సాగర్వైపు పోలీసులు గాలించారు. హైదరాబాద్, సైబరాబాద్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. 14 బృందాలుగా విడిపోయి చిన్నారి కోసం వెతికారు. అయినా ఏ ఆచూకీ దొరకలేదు.

ఇలా బయటపడింది..:
డీసీపీ విశ్వప్రసాద్ గురువారం రాత్రి అక్షర తల్లిదండ్రులుంటున్న గుడిసెలను పరిశీలించారు. అనంతరం సమీపంలోని జలవిహార్ సిబ్బందితో మాట్లాడారు. జలవిహార్ ఎదుట ఉన్న సీసీటివి కెమెరా ఫుటేజీని సంపాదించారు. అందులోని దృశ్యాలను పరిశీలించగా.. అక్షర నీటి గుంతలో పడి చనిపోయినట్టుగా గుర్తించారు. అయితే ఆమెను అందులోకి నెట్టింది ఆ 11ఏళ్ల బాలికే అని తేలడం గమనార్హం.

వేలు కొరికినందుకే..:
సీసీటీవి దృశ్యాల్లో అక్షరను 11ఏళ్ల బాలిక నీటి సంపు వద్దకు తీసుకెళ్లడం స్పష్టంగా రికార్డయింది. దీంతో బాలికను విచారించగా నేరం ఒప్పుకుంది. తన వేలు కొరికిందన్న కారణంతోనే అక్షరను గుంతలో పడేశానని చెప్పింది.
తల్లిదండ్రుల సమక్షంలో చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి చిన్నారిని సున్నితంగా విచారించారు పోలీసులు. దీంతో చిన్నారి అసలు విషయాన్ని బయటపెట్టింది.
దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరపగా.. అక్షర కుటుంబానికి, బాలిక కుటుంబానికి మధ్య తరుచూ గొడవలు జరిగేవని.. ఆ ప్రభావం కూడా ఉండి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. బాలికను అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్ కి తరలించారు.












Click it and Unblock the Notifications