కొయ్యూరు ఎన్కౌంటర్కు 17 ఏళ్లు: మావోల ఏర్పాట్లు, పోలీసుల వ్యూహాలు
అమరులైన నక్సల్స్ స్మారకార్థం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్టీ (పీఎల్జీఏ) వారోత్సవాలను డిసెంబర్ 2 శుక్రవారం నుంచి ప్రారంభించేందుకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేస్తోంది.
వరంగల్: అమరులైన నక్సల్స్ స్మారకార్థం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్టీ (పీఎల్జీఏ) వారోత్సవాలను డిసెంబర్ 2 శుక్రవారం నుంచి ప్రారంభించేందుకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఈ వారోత్సవాలను విఫలం చేసేందుకు పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో నక్సలైట్లు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావును కాల్చి చంపారు. దానికి ప్రతీకారంగా పోలీసులు బెంగలూరు నగరంలో అప్పి పీపుల్స్వార్ అగ్రనేతలు సంతోష్ అలియాస్ మహేష్, నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, శ్రీలం నరేష్ అలియాస్ మురళిలను అదుపులోకి తీసుకొని 1999 డిసెంబర్ 2న మల్హర్ మండలం కొయ్యూర్ అడవుల్లో ఎన్కౌంటర్ చేశారు.
సుదీర్ఘకాలం తాడిత, పీడిత ప్రజల కోసం పోరాడి అమరులైన అగ్రనేతల గుర్తుగా 200 డిసెంబర్ 2 పీఎల్జీఏ ప్లాటూన్ను పీపుల్స్వారు సంస్థ ఏర్పాటు చేసింది. నాటి నుంచి ప్రతి డిసెంబర్ 2 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో కేకేడబ్ల్యూ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇందుకోసం తాత్కాలిక స్థూపాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాఉండగా, పీఎల్జీఏ వారోత్సవాలను విఫలం చేసేందుకు జిల్లా ఓఎస్డీ రవీందర్రావు, మహదేవపూర్ డీఎస్పీ కేఆర్కే ప్రసాద్ ముందస్తు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మావోలను గోదావరినది దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
గ్రేహౌండ్స్ దళాలు, సీఆర్పీఎఫ్ బలగాలు, జిల్లా గార్డులు, సివిల్ పోలీసులతో కూంబింగ్ నిర్వహించేదుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. దీంతో కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న పచ్చని పల్లెల్లో ఇటు పోలీసులు, అటు అన్నల సంచారం పెరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అడవిబిడ్డలు ఆందోళన చెందుతున్నారు.