తెలంగాణలో తాజాగా 18 మందికి స్వైన్ ఫ్లూ...జర జాగ్రత్త!
తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరిలో 13 మంది హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: చలికాలం ముగుస్తున్నా స్వైన్ ఫ్లూ మహమ్మారి మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని వీడటం లేదు. తాజాగా తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరందరికీ స్వైన్ ఫ్లూ పాజిటివ్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వీరిలో 13 మంది హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. గత ఏడాది కూడా 3,696 మంది శాంపిల్స్ ను పరీక్షించగా వారిలో 250 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వెల్లడయింది.
ఈ వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో సరైన వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఎవరికైనా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ రోజులపా కనిపిస్తే.. స్వైన్ ఫ్లూగా అనుమానించాలని, ఆలస్యం చేయకుండా సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని పేర్కొన్నారు.