తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ: 2వేలకు చేరువలో కొత్త కేసులు, ఇద్దరు మృతి
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా కరోనావైరస్ కేసులు రాష్ట్రంలో భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 54,534 కరోనా నమూనాలను పరీక్షించగా.. 1913 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,87,456కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4036కు చేరింది. కరోనా బారి నుంచి బుధవారం 232 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 7847 యాక్టివ్ కేసులున్నాయి.

గత కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతున్న కేసులు
రెండో రోజు తెలంగాణలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. మంగళవారం 1,052 మంది కరోనా బారినపడితే.. బుధవారం కొత్తగా నమోదైన కేసులు దాదాపు 50 శాతం అధికమయ్యాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 1,520 కరోనా కేసులు రికార్డయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 979 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 132 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్ కేసులున్నాయి. 84 శాతం కేసులు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనే నమోదవుతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో విపరీతంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని చెప్పారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. ఇది ముందే అంచనా వేసినట్టుగా ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితమే ఒమిక్రాన్ వ్యాప్తిపై సీఎం మంత్రులు, అధికారులతో చర్చించారని, రెగ్యులర్గా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 4 రోజుల్లో 4రేట్లకు పైగా పాజిటివిటీ రేటు పెరుగుతోందన్నారు. డెల్టా వేరియెంట్ కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. వ్యాధి వ్యాప్తి తీవ్రంగానే ఉందని, కాకపోతే సీరియస్ అవ్వడం లేదన్నారు. 90శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించడం లేదన్నారు. మరో 10శాతం మందిలో కూడా సాధారణ లక్షణాలే ఉన్నాయని అన్నారు.
వ్యాధి లక్షణాలుంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. డెల్టాలో పాజిటివ్ వచ్చిన 3రోజుల తరువాత లక్షణాలు బయటపడ్డాయని, కానీ ఒమిక్రాన్ అలా కాదన్నారు. వైరస్ సోకిన సంగతి తెలియకుండానే వ్యాధి వ్యాప్తి వేగంగా జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సాధారణ లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రుల్లో అడ్మిట్ కావొద్దని సూచించారు. సీరియస్ ఉన్నవాళ్లు మాత్రమే ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు. అనవసరంగా ఆస్పత్రులకు వెళ్లి బెడ్స్ హోల్డ్ చేయరాదని, ఆక్సిజన్ సాచురేషన్ తక్కువగా ఉంటేనే అడ్మిట్ కావాలని శ్రీనివాసరావు సూచనలు చేశారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications