ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 లక్షల నగదు సాయం..! కేసీఆర్ చేతుల మీదుగా కొత్త స్కీం..!!
హైదరాబాద్ : సంక్షేమ పథకాల రూపకల్పనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూసుకెళ్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతు బాంధవుడు అనిపించుకున్న చంద్రశేఖర్ రావు ఇప్పుడు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ లకు ఉపయుక్తంగా ఉండే పథకానికి రూపకల్పన చేసారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని టీఆర్ఎస్ పార్టీ భావించింది. అయితే సమయాభావం వల్ల వాయిదా వేసుకున్నట్టు సమాచారం.
కొత్త పథకానికి శ్రీకారం..! ఎస్సీ ఎస్టీ ల అభ్యున్నతే టీ సర్కార్ లక్ష్యం..!!
ఎస్సీ, ఎస్టీల సమగ్ర వికాసానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తుం ది. ఆగస్టులో ప్రవేశపెట్టె పూర్తిస్థాయి బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రెండు లక్షల రూపాయల సాయం అందిం చాలని భావిస్తుంది. వందకు వంద శాతం సబ్సిడీతో, అది కూడా నగదు రూపంలో ఇవ్వాలని కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, కుటీర పరిశ్రమలు, భూమి అభివృద్ధి, కొత్త వ్యాపారం ప్రారంభించడం, ఇప్పటికే ఉన్న వ్యాపారం విస్తరణకు ఈ సాయాన్ని ఉపయోగించుకునేలా ప్రోత్సహించనుంది చంద్రశేఖర్ రావు ప్రభుత్వం.
ఎస్సీ ఎస్టీ వర్గాలు స్వయం సమృద్ధి సాధించాలి..! అదే సీయం ద్యేయం..!!
ఎస్సీ, ఎస్టీ రెండువర్గాలు స్వయం సమృద్ధి సాధించేలా సరికొత్త పథకాలకు రూపకల్పన చేయబోతున్నట్టు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో కీలక స్కీంను ఆగస్టులో ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్ లో చేర్చేందుకు కసరత్తు ప్రారంభించి నట్లు సమాచారం. రాష్ట్రంలో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కింద ఒక్కో యూనిట్ కు ప్రభుత్వం 1.25 లక్షల నూపాయలను అందజేస్తోంది. 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేస్తోంది. ఇందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తుండగా, మిగతా 25 శాతం లబ్ధిదారు సమకూర్చు కోవాల్సి ఉంటుంది. గొల్లకురుమలకు లబ్ధి కలిగిస్తున్నట్టుగానే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రత్యక్షంగా సాయం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రెండు లక్షల నగదు సాయం..! కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్న టీ ప్రభుత్వం..!!
2 లక్షల రూపాయల విలువైన ఒక్కో యూనిట్ ను ఒక్కో కుటుంబానికి ఇవ్వాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం. వందశాతం సబ్సిడీపై ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు 15 వేల కోట్ల రూపాయలు, ఎస్టీలకు 6 వేల కోట్ల రూపాయలతో కొత్త పథకాల రూపకల్పన కోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో ముఖ్యమంత్రి ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
మార్గదర్శకాలు రూపొందించిన కడియం కమిటీ..! అమలు చేయడమే తరువాయి..!!
ఇప్పటికే కార్పొరేషన్లు, అభివృద్ధి సంస్థల ద్వారా పలు పథకాలను అందిస్తున్నా, ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో ఆశించిన మేరకు ప్రగతి కనిపించడం లేదని చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సమగ్ర కుటుంబ వికాసానికి దోహద పడేలా పథకాలు రూపొందించాలని కడియం కమిటీకి ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో కూడిన ఈ కమిటీ పలు సూచనలు చేసినట్టుగా తెలిసింది. అందులో ప్రధానమైన పథకాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం క్రుతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.