ఖతార్లో చిక్కుకున్న 100మంది భారతీయులు, వీరిలో 20మంది తెలుగు కార్మికులు
దోహా/నిజామాబాద్: గత కొద్ది నెలలుగా సుమారు వందమంది భారతీయులు ఖతార్లో చిక్కుకుపోయారు. వీరిలో 20మంది తెలుగువారు ఉన్నారు. నిర్మాణ కంపెనీ మూతపడటంతో భారతీయులతోపాటు నేపాల్ కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు.
నాలుగేళ్లుగా పనిచేస్తున్న కంపెనీ మూతడటంతో అక్కడి భారతీయ కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అంతేగాక, దోహా, ఖతార్లోని ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు వారిని పంపించేసింది ఆ కంపెనీ.
దేవరాజ్ అనే కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ.. తాము నాలుగు నెలలుగా జీతాలు పొందడం లేదని చెప్పాడు. కోర్టులు తమకు న్యాయం చేయాలని చెప్పినప్పటికీ జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత దౌత్య అధికారులు తగిన విధంగా స్పందించడం లేదని చెప్పాడు. భోజనం, నివాసానికి కష్టాలు పడుతున్నామని వాపోయాడు.
తాము పనిచేస్తున్న కంపెనీ తమ పాస్ పోర్టులను ఇవ్వకపోవడంతో తాము అక్కడ అక్రమ వలసదారులుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. నిజామాబాద్, కామారెడ్డి, ఇతర తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులే ఎక్కువగా ఉన్నారని తెలిపాడు.
తెలంగాణ గల్ఫ్ మైగ్రేంట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ బసంత్ రెడ్డి కార్మికుల కష్టాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారిని ఎలాగైన స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఆ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కాగా, స్వదేశంలోని కార్మికుల కుటుంబసభ్యులు, బంధవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తమవారిని వెంటనే స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.