యుద్దప్రాంతంలో చిక్కుకున్న 23మంది తెలుగు విద్యార్థులు; కేంద్రమంత్రి ఆదేశం
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్, భారత దేశాల సరిహద్దు రాష్ట్రాలలో ప్రజలు భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో తీవ్ర భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి యుద్ధ ప్రాంతంలో 23 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం కొనసాగుతుంది.
యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
యుద్ద ప్రాంతంలో చిక్కుకుపోయిన 23 మంది తెలుగు విద్యార్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ లోని షేర్-ఇ-కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన వీరంతా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారంతా లేఖలో కోరటంతో మంత్రి అధికారులను ఈ మేరకు ఆదేశించారు.

సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు : బండి సంజయ్ ఆదేశం
యూనివర్శిటీ డీన్ తో, జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యతీసుకోవాలని మంత్రి బండి సంజయ్ చెప్పారు. గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ డ్రోన్ల సాయంతో, క్షిపిణిలతో కాశ్మీర్ లోని ప్రజలు నివసిస్తున్న ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్మీ శిబిరాలపై దాడి చేస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలంతా భయాందోళనల్లో ఉన్నారు. దీనికితోడు విమానాశ్రయాలను కూడా మూసివేయడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు.
కంట్రోల్ రూమ్ కు ఇప్పటికి 30 కాల్స్
దిక్కుతోచని స్థితిలో వారు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని లేఖ రాశారు. దీంతో కేంద్ర మంత్రి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిల్లీలోని తెలంగాణా భవన్ లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా అక్కడివారికి సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో సరిహద్దులలో చిక్కుకున్న తెలంగాణ పౌరుల నుండి ఇప్పటివరకు 30 ఫోన్ కాల్స్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
8మంది విద్యార్థులను కాపాడిన అధికారులు
8 మంది విద్యార్ధులను కాపాడినట్టు కంట్రోల్ రూమ్ అధికారులు పేర్కొన్నారు. వీరందరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విద్యార్థులు ఎవరు అధైర్య పడదని తాము అండగా ఉంటామని అధికారులు భరోసా ఇస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలలో చిక్కుకున్న వారిని కాపాడి వారికి వసతి సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications