Ponnam Prabhakar: మంత్రి పొన్నంను కలిసి 317 జీవో బాధితులు..
జీవో నంబర్ 317తో ఉద్యోగుల బతుకు ఆగమయిందని ప్రభుత్వ ఉద్యోగులు తెలిపారు. స్థానికత లేకుండా మెరిట్, సీనియారిటీ ఆధారంగా చేపట్టిన బదిలీలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. బాధిత ఉద్యోగులు ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో స్థానిక, రిజర్వేషన్ కలిగిన ఆదివాసీ ప్రాంతాల స్టూడెంట్స్ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా బీఆర్ఎస్ సర్కార్ కావాలనే విభజన ప్రక్రియ చేపట్టి నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఏకపక్షంగా జీవో తెచ్చి తమను బదిలీ చేశారని పేర్కొన్నారు. టీచర్లను వేరే జిల్లాలకు, జోన్లకు బదిలీ చేసి స్థానికత కోల్పోయేట్టు చేశారని ఆరోపించారు. కొందరు టీచర్లు బీఆర్ఎస్ లీడర్ల పైరవీలతో నగరాలు, పట్టణాల్లో పోస్టులు పొందారని ఆరోపించారు. స్థానికతను విస్మరించడంతో కొత్త జోనల్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం నీరుగారిపోయిందన్నారు.

317 జీవో ఉప సంహరించుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ఉద్యోగులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు
2023కు వీడ్కోలు పలుకుతూ హుస్నాబాద్ లోని తన ఇంట్లో కేక్ కట్ చేసి 2024కు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు వచ్చే వాళ్లంతా బొకేలు, శాలువాలు కాకుండా.. నోట్ బుక్స్ తీసుకురావాలని సూచించారు.












Click it and Unblock the Notifications