అర్ధరాత్రి రియాల్టర్ దారుణ హత్య: రిసెప్షన్కు తీసుకెళ్తాడని పిల్లల నిరీక్షణ
హైదరాబాద్: భాగ్యనగరంలోని బేగంపేటలో 38 ఏళ్ల రియాల్టర్ శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అతడు తన స్నేహితుడి కలిసేందుకు ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి అతనిని పొడిచి చంపారు.
భూవివాదాల నేపథ్యంలో ఆ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తల్వార్లు, కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లుగా భావిస్తున్న నిందితులు.. ఆ తర్వాత బేగంపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
షేర్ఖాన్ బస్తీకి చెందిన ఖాజా మహమూద్ ఖాన్ రెండో కుమారుడు రియాజ్ ఖాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి స్థానికంగా ఉండే తన మిత్రుడు అలీకి చెందిన బేగంపేట డయాగ్నస్టిక్ సెంటర్కు వెళ్లాడు.
మిత్రుడితో గంటసేపు మాట్లాడిన తర్వాత ఇంటికి వెళతానని తన బైక్ పైన కొంత దూరం వెళ్లాడు. సమీపంలోని విజయ బ్యాంకు ముందుకు రాగానే గుర్తుతెలియని దుండగులు కత్తులు, తల్వార్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టి హోండా యాక్టీవాపై పరారయ్యారు.
దీంతో తీవ్రంగా గాయపడిన రియాజ్ అపస్మారక స్థితికి చేరి అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రియాజ్ను కిమ్స్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఘటనా
హత్యకు ఓ స్థలానికి సంబంధించిన వివాదమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హత్యకు కారకులమని పేర్కొంటూ ఇమ్రాన్ డాలర్, ఖాదర్, అజ్రూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మృతుడు రియాజ్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
బేగంపేటలోని చికోటి గార్డెన్ వద్ద నాలుగు ఎకరాల భూమి వివాదమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై గత పదేళ్లుగా వివాదం కోర్డులో నడుస్తోంది. త్వరలో కోర్టులో తీర్పు రానుంది. ఈ తీర్పు రియాజ్ ఖాన్కు అనుకూలంగా వస్తుందని భావించే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రియాజ్ ఖాన్, అతని సోదరులు, కజిన్స్కు కలిపి చికోటి గార్డెన్ వద్ద నాలుగు ఎకరాలు ఉంది. మిగతా సోదరులు, కజిన్స్ వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రియాజ్ ఖాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి భూమి వివాదాన్ని ఆయన స్వయంగా చూసుకుంటున్నారు. రియాజ్ ఖాన్ హత్యకు షరీఫ్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కాగా, శనివారం రాత్రి రియాజ్ ఖాన్ కుటుంబ సభ్యులు ముషీరాబాదులో ఓ వేడుకకు వెళ్లవలసి ఉంది. రియాజ్ ఖాన్, ఆయన సోదరులు అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. సోదరులు, వారి కుటుంబ సభ్యులు వేడుకకు వెళ్లారు. రియాజ్ మాత్రం.. తన భార్యను, పిల్లలను తాను వచ్చే వరకు ఉండమని చెప్పారు.
దీంతో వారు ఇంటిలోనే ఉన్నారు. శనివారం రాత్రి రియాజ్ హత్యకు గురయ్యాడనే విషయం తెలుసుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. రియాజ్ పిల్లల వయస్సు మెహ్విన్ ఆరేళ్లు, రిదా మూడేళ్లు. తండ్రీ వచ్చి తమను వేడుకకు తీసుకెళ్తారని ఆ పిల్లలు నిరీక్షించారు. ఇప్పుడు తమ తండ్రి చనిపోయాడని అర్థం చేసుకునే వయస్సు కూడా రిదాకు లేదు.