భాగ్యనగరిలో రెండు రోజుల్లో 4.9 కోట్ల నగదు పట్టివేత ... అవాక్కయ్యేలా ఎక్కడ చూసినా డబ్బే డబ్బు
ఒకపక్క పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరికొన్ని గంటల్లో నేతల భవిష్యత్ ఓటర్లు రాయనున్నారు. ఇక నగదు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టే పనికి శ్రీకారం చుడతాయి రాజకీయ పార్టీలు. అందుకోసం ఇంతకాలం దాచిన కట్తల పాములు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా డబ్బుల కట్టలు బయటపడుతున్నాయి. ఒక్క రెండు రోజుల్లోనే 4.9 కోట్ల నగదు పట్టుబడటం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఎన్నికల కోడ్ ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు .. ఎందుకంటే
హైదరాబాద్ కేంద్రంగా భారీగా పట్టుబడుతున్న నగదు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో భాగంగా నల్లధనం సంబంధిత ప్రాంతాలకు తరలి పోతోంది. ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులు, పోలీసులు తరలుతున్న నగదును పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. బస్సులు, కార్లు, టూ వీలర్లు వేటినీ వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రోజురోజుకు పట్టుబడుతున్న డబ్బు విస్మయానికి గురిచేస్తుంది. మొన్నటికి మొన్న మురళీమోహన్ కంపెనీకి చెందిన 2 కోట్ల రూపాయలు దొరికితే.. మళ్లీ ఇప్పుడు ఒకే రోజు 2 కోట్ల 60 లక్షలు పట్టుబడ్డాయి. శని, ఆదివారాల్లోనే టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు రూ.4,92 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తంలో రూ.2.60 కోట్లు పక్కా సమాచారం ఆధారంగా, మరో రూ.2.3 కోట్లు వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం వెల్లడించారు. మొత్తం ఎనిమిది కేసుల్లో రెండింటిలో పార్లమెంట్ ఎన్నికల లింకులు ఉన్నట్టు గుర్తించారు.
వాహన తనిఖీల్లో బయటపడుతున్న నగదు
బంజారాహిల్స్, మలక్ పేట ఏరియాల్లో జరిపిన తనిఖీల్లో ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సరైన పత్రాలు చూపించని కారణంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషినల్ డీసీపీ రాధాకృష్ణ, చైతన్య ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో సాత్విక్ రెడ్డి, సౌరబ్ గోయల్ అనే ఇద్దరు వ్యక్తులు రూ.26.19 లక్షలు డబ్బు తరలిస్తుండగా సోమాజీగూడలో పట్టుబడ్డారు.అలాగే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 5268 నంబర్ గల కారులో తాండ్ర కాశీనాథ్ రెడ్డి, తిరుమలగిరికి చెందిన భుక్యా రవిలు రూ.34.30 లక్షలు తరలిస్తుండగా ముసారాంబాగ్ లో స్వాధీనం చేసుకున్నారు.
నగదును ఐటీ శాఖకు తరలించి కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో టాటా ఇన్నోవాలో మల్లారెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచికోటి రూపాయలుస్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట, ఓయూ, గోల్కొండ, ఎస్సా ర్నగర్, జూబ్లీహిల్స్, టప్పాచబుత్ర పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.2.32 కోట్లకుపైగా స్వాధీనమైంది. ఆయా పీఎస్లలో కేసులు నమోదు చేసి నగదును ఐటీ శాఖకు అప్పగిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రెండు రోజుల్లో 4.9 కోట్ల రూపాయల నగదు పట్టుకోవడం సంచలనంగా మారింది.