పసిమొగ్గను చిదిమేశాడు: గొంతు కొరికి, తలను నేలకుబాది హత్య
కరీంనగర్: జిల్లాలోని వీణవంక మండల కేంద్రంలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను మరిచిపోకముందే, జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన వెలుగుచూసింది.
రోజూ పలకరించే పొరుగు వ్యక్తే కదా అని నమ్మి వెంటవెళ్లిన అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిమొగ్గను ఓ కామాంధుడు చిదిమేశాడు. ఆ చిన్నారిపై కర్కశత్వం చాటాడు. అత్యాచారానికి పాల్పడటమే కాక బుగ్గలు, గొంతు కొరికి.. తలను నేలకు బాది.. మెడలు విరిచేసి ప్రాణాలు తీశాడు.
ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని కాటారం మండలం దామెరకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన రాజస్వామి, దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇందుజ (6), వినయశ్రీ (4), కుమారుడు అంజయ్య (2) ఉన్నారు.
పోలీస్శాఖలో రాజస్వామి హోంగార్డుగా, త్రివేణి అంగన్వాడి కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఇద్దరు కుమార్తెలను పాఠశాలకు పంపారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి వినయశ్రీ అంటూ పలకరిస్తూ దగ్గరుకు తీసుకున్నాడు.
చిన్నారిని పలకరిస్తూ చాక్లెట్ ఇచ్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా పాపను కాసేపు ఆడించి, తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఊపిరి ఆడని ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మరణించినట్లు గమనించిన వెంకటస్వామి ఇంట్లోనే ఓ గంప కింద దాచేసి, ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.
చిన్నారి కోసం సాయంత్రం వరకు వేచి చూసిన తల్లిదండ్రులు బంధువులు, చుట్టుపక్కల ఇళ్లలో ఆరా తీశారు. అయినప్పటికీ ఆచూకి లభించలేదు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, గ్రామస్థులు కలిసి వెతికినా ఫలితం లేదు. దీంతో ఆదివారం ఉదయం అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, గ్రామస్థులు తాళం వేసి ఉన్న వెంకటస్వామి ఇంటి కిటికిలోంచి లోపలికి చూశారు.
బుట్ట కింద పాప దుస్తులు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. తాళం పగుల గొట్టి ఇంట్లో పరిశీలించగా బుట్ట కింద చిన్నారి మృతదేహం కనిపించింది. కాటారం సీఐ సదన్కుమార్, ఎస్సై రమేశ్లు గ్రామానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంకటస్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యానికి బానిసైన వెంకటస్వామి గ్రామంలో పలువురితో గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.