తెలంగాణలో మరో 42 కరోనా కేసులు.. రేపు సాయంత్రం కేబినెట్ భేటీ...
తెలంగాణలో మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1551కి చేరింది. ఇప్పటివరకూ 34 మంది మృతి చెందారు. ఆదివారం మరో 21 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.దీంతో ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 525గా ఉంది.
ఇప్పటివరకూ చేసిన కరోనా టెస్టుల్లో 14,256(94శాతం) మంది పురుషులకు నెగటివ్గా తేలగా,947 మంది(6శాతం) పురుషులకు పాజిటివ్గా తేలినట్టు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ఇక 7,619 (93 శాతం) మంది స్త్రీలకు కరోనా నెగటివ్గా తేలగా, 566 మందికి (7 శాతం) పాజిటివ్గా తేలినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిరోజులు తగ్గుముఖం పట్టడం,మళ్లీ పెరగడం జరుగుతూ వస్తోంది. శుక్రవారం వరకు వరుసగా నాలుగు రోజులు తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు శనివారం ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం (మే 16) ఎల్బీనగర్ నగర్ పరిధిలోని మాదన్నపేటలోని ఒకే అపార్ట్మెంట్లో 28 మంది కరోనా కేసులు నమోదవడం తీవ్ర కలకలం రేపింది.
ఇదిలా ఉంటే,తాజా లాక్ డౌన్ పొడగింపుకు సంబంధించి కేంద్రం ఇచ్చిన కొత్త గైడ్ లైన్స్పై సోమవారం(మే 18) సాయంత్రం 5గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశమై చర్చించనుంది. గైడ్ లైన్స్ విషయంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్దరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే సమగ్ర నియంత్రిత వ్యవసాయ విధానం,పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు.