బానిసగా మార్చిన భర్త: 21 ఏళ్ళకు హైద్రాబాద్కు తిరిగొచ్చిన మహిళ
హైదరాబాద్: భర్త మోసం చేయడంతో పాకిస్థాన్లో బానిసగా బతుకుతున్న పాతబస్తీకి చెందిన మహమ్మదీ బేగం ఎట్టకేలకు 21 ఏళ్ళ తర్వాత స్వదేశానికి చేరుకొంది. పాకిస్థాన్లో బానిసగా బతుకుతున్న కూతురు కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విదేశాంగ శాఖ చొరవతో బేగం బుధవారం నాడు హైద్రాబాద్ చేరుకొన్నారు.
హైద్రాబాద్ బండ్లగూడకు చెందిన మహమ్మదీ బేగం(45)కు 21 ఏళ్ల కిందట టెలిఫోన్లో ఒమన్ దేశస్థుడితో నిఖా కుదిరించారు. ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత భర్త ఒమన్ కాదు పాకిస్థాన్ దేశస్థుడని తెలిసింది.
ఒమన్ నుండి ఆమెను పాకిస్థాన్కు తీసుకెళ్ళి భర్త ఆమెను బానిసగా మార్చాడు. అయితే ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇచ్చింది.
దీంతో ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. పాకిస్థాన్లో భారత్ హైకమిషన్ అధికారులు, సిబ్బంది ఆమెకు వీసా ఇప్పించినా భారత్కు పంపేందుకు భర్త అడ్డంకులు సృష్టించాడు.
దీంతో ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లాఖాన్ ఆమెను తిరిగి రప్పించాలని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్కు విజ్ఞప్తి చేశారు. విదేశాంగ శాఖ అధికారుల చొరవతో ఎట్టకేలకు మహమ్మదీ బేగం బుధవారం ఉదయం లాహోర్ నుంచి దిల్లీకి చేరుకుంది.
అక్కడ ఆమెను తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ అశోక్కుమార్, ఎంబీటీకి చెందిన డా.జరార్లు కలుసుకున్నారు. రాత్రి నగరానికి చేరుకుని రెండు దశాబ్దాల తర్వాత తల్లిదండ్రులను కలుసుకొంది.