తెలంగాణలో కొత్తగా 462 కరోనా కేసులు: మహమ్మారి బారినపడిన 9 మంది గురుకుల విద్యార్థులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 25,518 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 462 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 403 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
శుక్రవారం వెలుగుచూసిన కొత్త కరోనా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 8,01,406కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,111 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.90 శాతంగా ఉంది. కాగా, హైదరాబాద్ నగర పరిధిలోనే 259 కరోనా కేసులు కొత్తగా వెలుగుచూశాయి.
గురుకుల పాఠశాలలో కరోనా కలలం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు పది నెలల తర్వాత మరోసారి కరోనా కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 350 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి విద్యార్థులు కరోనా బారినపడినట్లు తేలింది.
ఇటీవలే ఇదే పాఠశాలలో ఇద్దరికి కరోనా సోకింది. దీంతో పాఠశాల విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మరో 9 మంది విద్యార్థులు కరోనా బారినపడినట్లు తేలింది. వీరందరినీ హోం క్వారంటైన్ కు తరలించారు. విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్కు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని, శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారంతో పోలిస్తే 1749 కేసులు తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 17,070 మంది వైరస్ బారినపడ్డారు. మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొవిడ్ నుంచి 14,413 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.55 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.24 శాతంగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసులు 1,07,189కు పెరిగాయి.