తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు: ఈ జిల్లాల్లో ఒక్క కేసూ లేదు!
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 40 కేసులుండగా, రంగారెడ్డి జిల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది.

1414కి కరోనా కేసులు..
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనాబారిన పడిన వలస కూలీల సంఖ్య 37కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1414కి చేరింది. తాజాగా 13 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 952 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

పురుషుల మరణాలే ఎక్కువ
ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్రంలో 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 428 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల్లో పురుషులతో పోల్చితే మహిళలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 27 మంది పురుషులు కాగా, ఏడుగురు మహిళలు ఉన్నారు.
Recommended Video

ఈ జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు..
తెలంగాణలో ఇప్పటి వరకు యాదాద్రి-భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. గత 14 రోజులుగా రాష్ట్రంలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్, వికారాబాద్, నల్గొండ, కుమురంభీం అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, జనగామ, జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కాగా, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వారికి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications