తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు: జీహెచ్ఎంసీ పరిధిలోనే 300కిపైగా, 3 మరణాలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు శుక్రవారం భారీగా నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 499 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6526కి చేరాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో ఈరోజు మరో మూడు మరణాలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య 198కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 2976 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 3352 మంది డిశ్చార్జయ్యారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పాజిటివ్ కేసులు 4526కు చేరాయి.

మరోవైపు గచ్చిబౌలిలో ఒకే రోజు 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సిబ్బంది, కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 99 మందికి పరీక్షలు చేయగా 33 మందికి కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మరో 15 మంది పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు. కాగా, ఒకేసారి కరోనా కేసులు భారీగా నమోదవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,86,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,65,009 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,08,576 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 12,707 మంది మరణించారు.












Click it and Unblock the Notifications