పూర్తైన యాభై రోజులు :నల్ల కుభేరులకు ఇక చిక్కులే
పెద్ద నగదు నోట్లను రద్దుచేసి ఇవాళ్ఠికి యాభై రోజులు పూర్తైంది. తనకు యాభై రోజుల సమయం ఇవ్వండి అని ప్రకటించిన ప్రధాని మోడీ అడిగిన గడువు కూడ పూర్తైంది.
హైదరాబాద్ :పెద్ద నగదు నోట్లను రద్దుచేసి ఇవాళ్ఠికి యాభై రోజులు పూర్తైంది. తనకు యాభై రోజుల సమయం ఇవ్వండి అని ప్రకటించిన ప్రధాని మోడీ అడిగిన గడువు కూడ పూర్తైంది. పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం దేశంలో ఏ రకంగా ఉంటుంది. నల్ల ధనం నిర్మూలించబడుతోందా, నల్లధనాన్ని కలిగివున్నవారిపై ప్రభుత్వం ఏం చేయనుంది. సామాన్యుల జీవన ప్రమాణాలు పెరుగుతాయా ఏమౌతోందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
దేశంలో నల్లధనాన్ని నిర్మూలించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దుచేసింది. ఈ ఏడాది నవంబర్ 8వ, తేది రాత్రిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.ఈ నిర్ణయంతో దేశంలో కరెన్సీ కోసం ప్రజలు ఇక్కట్లు పడ్డారు.
పెద్ద నగదు నోట్లను రద్దుచేసి యాభై రోజులు గడిచింది. యాభై రోజుల సమయం తనకు ఇవ్వండి . ఈ లోపుగా తాను అన్ని రకాలుగా మార్పులు చేస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. ప్రధాని ప్రకటించిన 50 రోజుల గడువు డిసెంబర్ 30వ, తేదితో పూర్తైంది.
గడువు పూర్తైంది. అయితే ఏ రకమైన మార్పులు వస్తాయనే దానిపై సామాన్యులు ఆశతో ఉన్నారు. అయితే ఇంకా దేశ వ్యాప్తంగా చాల ప్రాంతాల్లో కొత్త కరెన్సీ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరెన్సీ కష్టాలు ఇంకా తీరలేదు. ఫిబ్రవరి చివరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.
పాత నోట్లను ఏం చేస్తారు.
రద్దుచేసిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకు డిసెంబర్ 30వ, తేదితో గడువు ముగిసి పోతోంది. అయితే పెద్ద నగదు నోట్లను రద్దుచేసింది కేంద్రం. అయితే ఇంకా రద్దుచేసిన నగదు ఉన్నవారు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఆర్ బి ఐ శాఖల వద్ద వచ్చే ఏడాది మార్చి 31 వ, తేది వరకు నగదును మార్చుకొనే అవకాశం కల్పించింది ప్రభుత్వం.మరో వైపు కేంద్రం తాజాగా ఆర్డినెన్స్ ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారంగా రద్దుచేసిన ఐదువందలు, వెయ్యి రూపాయాల నోట్లు పదికి మించి కలిగి ఉంటే నేరం.మిలటరీలో పనిచేసేవారు ,విదేశాల్లో ఉండేవారు, బయటి ప్రపంచాలతో సంబంధాలు లేని వారు ,ఇతర అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పదికి మించి ఈ నగదు నోట్లను కలిగి ఉంటే అనుమతిస్తారు.అంతకు మించి రద్దుచేసిన నోట్లను కలిగి ఉంటే ఎన్ని నోట్లు ఉంటే అంతకు ఐదు రెట్టు జరిమానా విధిస్తారు.
నల్లడబ్బు ఆదాయపు పన్నుశాఖాధికారులకు పట్టుబడితే
రద్దుచేసిన నగదును పదికంటే ఎక్కువ కలిగి ఉంటే నేరం అవుతోంది. అయితే నల్లధనం ఉన్నవారు తమ వద్ద ఉన్న డబ్బును మార్పిడి చేసుకొనేందుకు ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకు వచ్చింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్. ఈ పథకం కింద ఈ నగదును జమ చేయవచ్చు. ఈ రకంగా జమ చేస్తే పన్ను, జరిమానాలు అన్నీ కలుపుకొని 50 శాతంతో బయటపడే అవకాశం ఉంది.అయితే నల్లధనం ఆదాయపు పన్నుశాఖ అధికారుల సోదాల్లో బయటపడితే 107.25 శాతం నుండి 137.25 శాతం వరకు పన్ను, సర్ చార్జీలు, సుంకాలను విధించనున్నారు. అయితే ఈ పన్ను భారం డిసెంబర్ 30లేదా 31 మద్య అమలు అవుతోందా, లేక 2017 మార్చి 31 తర్వాత అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అవినీతి, మనీలాండరింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, బినామీ ఆస్తులు ఉన్నవాళ్ళు , విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినవాళ్లు ఈ పథకం కింద డిపాజిట్లకు అనర్హులు.
నగదు ఉపసంహరణపై ఆంక్షల పరిస్థితేమిటి
బ్యాంకుల నుండి, ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షల పరిస్థితి ఏ రకంగా ఉంటుందనే విషయమై ఇంకా స్ఫష్టత రావాల్సి ఉంది. ఇప్పటికిప్పుడే బ్యాంకుల నుండి నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయకూడదని బ్యాంకులు కోరుతున్నాయి. మార్చి 31వ, తేది తర్వాత బ్యాంకుల్లో నగదు తీసుకోవడంపై పరిమితులను ఎత్తివేసే అవకాశం ఉంది.
బినామీ ఆస్తులపై ఏ రకమైన చర్యలు
బినామీ ఆస్తులను గుర్తిస్తే , ఆ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుంది. అయితే బినామీల దొరలకు ఐదు నుండి ఏడేళ్ళ వరకు జైలు శిక్ష ఆయా ఆస్తుల మార్కెట్ విలువలో 25 శాతం జరిమానా విధింపు వంటి కఠిన చర్యలను తీసుకొనున్నారు. దీనివల్ల బినామీ ఆస్తులున్నావారు వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న నోరు మెదపని పరిస్థితి ఉంటుంది. ఈ ఆస్తులు తమవే అని బయటకు వస్తే వాటి కొనుగోలుకు సంబందించిన ఆదాయం ఎక్కడి నుండి వచ్చిందో చూపాల్సిందే.లేకపోతే బినామీ చట్టం కింద జైలుకు వెళ్ళాల్సిందే.
రియల్ ఏస్టేట్ పెరుగుతోందా తగ్గుతోందా
పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం తర్వాత రియల్ ఏస్టేట్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దేశంలోని ప్రధానమైన నగరాల్లోని రియల్ ఏస్టేట్ పై పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం చూపింది.నగదు లభ్యత పెరిగితే కొనుగోళ్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. నల్లధనం కారణంగా భూమలు ధరలు పెరిగాయని, ప్రస్తుతం వాస్తవ ధరకే భూముల క్రయవిక్రయాలు సాగుతాయని వారు అభిప్రాయంతో ఉన్నారు. భూములు కొనుగోలుచేసే సామాన్యులకు ఇది ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.