52ఇంచుల చాతి ఎందుకు బీసీలను పట్టించుకోవడం లేదు?మోదీని వినూత్నంగా విమర్శించిన టీ మంత్రులు!
హైదరాబాద్ : కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం ఉద్యమంలో ఉన్న కుటుంబమని, చంద్రశేఖర్ రావు కుటుంబం వల్లే బీసీలు తెలంగాణలో సగర్వంగా జీవిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేసారు. 19 బీసీ గురుకులాల నుండి 281కి పెంచి 1,50,000 మంది బీసీ బిడ్డల్ని తెలంగాణ ప్రభుత్వం చదివిస్తున్నదన్నారు గంగుల. 52 ఇంచుల ప్రధాని చాతి ఎందుకు బీసీలను పట్టించుకోవడం లేదని గంగుల నిలదీసారు. బీసీ మంత్రిత్వ శాఖ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ జనగణన ఎందుకు చేయడం లేదన్నారు. హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి విమర్శించడం తప్ప ప్రధాని ఇచ్చింది ఏమీలేదన్నారు మంత్రి గంగుల. తమ మౌనాన్ని అసమర్ధతగా భావించవద్దని, సమయం వచ్చినప్పుడు అన్నీ అంశాలు ప్రజలముందుంచుతామని మంత్రి గంగుల బీజేపి నేతలకు స్పష్టం చేసారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రిని రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రులు ఎందుకు రావట్లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి డ్రామాలు చూస్తున్నామని, ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆ వేషం వేస్తారని, రోజుకు 10 డ్రెస్సులు మార్చి ఫ్యాషన్ షో చేయడమే ఆయనకు తెలుసని తలసాని ఎద్దేవా చేసారు. అధికారంలో మీరే ఉన్నారు కదా దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి మళ్లీ పోటికి వస్తారా అని తలసాని బీజేపి నాయకులకు సవాల్ విసిరారు. దావోస్ లో అన్ని రాష్ట్రాల మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారు కానీ తెలంగాణకే ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయో అర్ధం చేసుకెవాలన్నారు. మంత్రి కేటీఆర్ చరిష్మా చూసి తట్టుకోలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ పసలేని ఆరోపణలు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ మాధిరి పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారో బీజేపి చూపించగలుగుతుందా అని నిలదీసారు.