పాతబస్తీలో దారుణం: మైనర్ బాలికను పెళ్లాడిన వృద్ధుడు, అరబ్ షేక్లు కాదు, కేరళ కేటుగాళ్లు
హైదరాబాద్: పాతబస్తీలో ఒప్పంద వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి తాజా ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. 16 ఏళ్ల మైనర్ బాలికను 60 ఏళ్ల వృద్ధుడు వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అరబ్ షేక్ల దురాఘతాలు మరువకముందే ఇప్పుడు కేరళ కేటుగాళ్లు పాతబస్తీపై కన్నేశారు. తల్లిదండ్రులకు భారీగా డబ్బుల ఆశచూపి మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు ఓ కేరళ వృద్ధుడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అబ్దుల్ లతీఫ్, అబ్దుల్ రెహమాన్, ఫరాతుల్లా, రెహమా తుల్లా అనే నలుగురు కలిసి పాతబస్తీలోని ఫలక్నుమాలో ఉన్న 16ఏళ్ల బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. మీ కష్టాలన్నీ తీరుస్తాం.. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని లబ్దుల్ లతీఫ్ వారిని కోరాడు.
ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులకు 2 లక్షల 50వేల రూపాయలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో అబ్దుల్ లతీఫ్ కోరినట్లుగానే డిసెంబర్ 27న బండ్లగూడలో తల్లిదండ్రులు మైనర్ బాలికను 60ఏళ్ల వృద్ధుడు లతీఫ్కు ఇచ్చి వివాహం జరిపించారు.
ఈ వివాహానికి సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను కాపాడారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాలిక సవతి తల్లి, తండ్రిని కూడా ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరబ్ షేక్ల కాంట్రాక్ట్ పెళ్లిళ్ల దురాఘతాలపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడంతో గణనీయంగా ఇలాంటి కేసులు తగ్గాయి. ఇప్పుడు తాజాగా కేరళ నుంచి కేటుగాళ్లు తయారయ్యారు.