కెసిఆర్పై ఒత్తిడి: ఏపీకి చెందిన 650 మంది ఉద్యోగులకు తెలంగాణ షాక్!
హైదరాబాద్: ఇప్పటికే పన్నెండు వందల మందికి పైగా ఉద్యోగులను రిలీవ్ చేసిన కెసిఆర్ ప్రభుత్వం తాజాగా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 650 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపాధ్యాయులను వెనక్కి పంపేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.
ఏపీకి చెందిన దాదాపు 650 మంది ఉపాధ్యాయులు హైదరాబాద్, సరిహద్దు జిల్లాల్లో పని చేస్తున్నారు. వీరిని ఏపీకి తిప్పి పంపించాలని స్థానిక ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు వస్తున్నాయని అంటున్నారు.
ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఏపీకి చెందిన ఉపాధ్యాయుల జాబితాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అందించారని తెలుస్తోంది. వీరిని 2015-16 అకడమిక్ ఇయర్ తర్వాత రిలీవ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన 1200 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. ఇది కోర్టుకు ఎక్కింది. విద్యుత్ ఉద్యోగులకు రెండు ప్రభుత్వాలు వేతనాలు ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీని వేసిన విషయం తెలిసిందే.