టీలో తొలుత కొత్తగా 7 జిల్లాలు, ఇవే: 6 నెలల్లోనే..
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వివిధ సందర్భాలలో చేసిన ప్రకటనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొదటి దశలో ఏడు జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట, వికారాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూలు, మంచిర్యాల, జగిత్యాలలు కేంద్రంగా కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి.
దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లతో పాటు పరిపాలనను మరింత సులభతరంగా మార్చి ప్రజలకు మెరుగైన పాలనను అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా వికేంద్రీకరణతోనే సత్వర అభివృద్ధి సాధ్యమన్న సంకల్పంతో మరో ఏడు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రెవిన్యూశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకు అదనంగా మరో 14 జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల ప్రణాళికలో తెరాస హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతలో ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
దీంతో తొలి విడతలో రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల, కరీంనగర్ జిల్లా జగిత్యాల, నల్లగొండ జిల్లా నుంచి సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లా నుంచి నాగర్కర్నూల్, ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం, మెదక్ జిల్లా నుంచి సిద్దిపేటను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సిసిఎల్ఎ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ఏడు కొత్త జిల్లాల ఏర్పాటును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోసం పంపించనున్నట్టు రెవిన్యూశాఖ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత పరిపాలనా సౌలభ్యం కోసమే కాకుండా భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తామని ఎన్నికల ప్రణాళికలో తెరాస హామీ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 681 జిల్లాలు ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్కొ జిల్లాకు సగటు జనాభా 19 లక్షలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో మాత్రమే సగటున జిల్లాకు 29 లక్షల జనాభా ఉన్నారు.
కానీ చత్తీస్గడ్, హర్యానలో ఏడు లక్షల కంటే తక్కువ జనాభాకే ఒక్కొ జిల్లా ఉంది. కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ ఎక్కువ జనాభాతో, మరి కొన్ని జిల్లాల్లో తక్కువ జనాభాతో జిల్లాలు ఉన్నాయి. అలా కాకుండా మధ్యమార్గంగా తెలంగాణలో జిల్లాలను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం యోచించింది. తెలంగాణను 24 జిల్లాలుగా పునర్ వ్యవస్తీకరిస్తే జిల్లాకు సగటున పదిహేను లక్షల జనాభా కలిగి ఉంటుందని ప్రభుత్వం అంచన వేసింది.
దీంతో కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల పరిపాలన మరింత చేరువ అవుతుందని, అలాగే సమీప భవిష్యత్లో 24 జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందడానికి జిల్లా కేంద్రాలు ముఖ్య పట్టణాలుగా ఎగడానికి దోహదపడుతుందని ప్రభుత్వం యోచనగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు జిల్లాలనే యూనిట్గా తీసుకుంటుండటంతో ఎక్కువ జిల్లాలు ఉండటం వల్ల ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేయబోయే 14 జిల్లాలకుగాను తొలి విడతలో ఏడు జిల్లాలకు ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా కెసిఆర్ ఇటీవల ఆదేశించడంతో ఈ మేరకు రెవిన్యూశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. కాగా, కొత్త జిల్లాలను ఆరు నెలల వ్యవధిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.