'పేట' కన్నీరు పెట్టింది: మేడ్చల్ టోల్గేట్ వద్ద 8 మంది మృతికి కారణాలివే
హైదరాబాద్: స్నేహితుని సోదరి పెళ్లి విందుకు హాజరయ్యేందుకు టవేరా వాహనంలో బయల్దేరిన తొమ్మిది మందిలో ఎనిమిది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నగర శివారులోని మేడ్చల్లో కండ్లకోయ సుత్తారిగూడ టోల్ గేట్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని విశ్లేషిస్తే...
సూచికలు లేకపోవడం
టోల్ గేట్ వద్ద ఏ మాత్రం వాహనదారులను అప్రమత్తం చేసే సూచనలు లేకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్కుమార్ అక్కడికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. టోల్ యాజమాన్యం సరైన నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదం సంభవించిందని అన్నారు.
టోల్ గేట్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు
ఈ ఘటనలో టోల్ గేట్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి మెదక్ జిల్లా సదాశివపేట నుంచి టవేరాలో ఇమ్రాన్ తన సోదరీ పెళ్లి విందు వేడుకకు స్నేహితులతో కలిసి రాత్రి 10.15 గంటలకు సదాశివపేట నుంచి ప్రయాణమయ్యారు.
చీకటి కారణంగా
ఔటర్ రింగ్ రోడ్డుపై మేడ్చల్ సుత్తారిగూడ టోల్ గేట్ వద్దకు వస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కాబట్టి వాహన వేగం వంద మీద నడిచింది. టోల్ గేట్ వద్ద వీఆర్ఎల్ ట్రాన్స్ పోర్టు వ్యాన్ టోల్ గేటు వద్ద ఎగ్జిట్ టిక్కెట్ ను తీసుకుంటుండటంతో ఇమ్రాన్ బృందం ప్రయాణిస్తున్న టవేరా డ్రైవర్ కూడా చీకటి కారణంగా టోల్ గేట్ వద్ద మరో వాహనం ఉందని గమనించలేకపోయాడు.
అతి వేగమే
అయినప్పటికీ అతి కష్టం మీద టవేరా వాహనాన్ని కంట్రోల్ చేశాడు. ఇంతలో వీరి వెనుక అతి వేగంతో వచ్చిన డీసీఎం అదుపు తప్పి వందకు పై స్పీడులో వెనుక నుంచి ఢీకొట్టాడు. అంతే సెకన్లలో వాహనం రెండింటి మధ్య నలిగి నుజ్జు నుజ్జైంది. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
మృతదేహాలను వెలికి తీయడానికి రెండు గంటలు
టవేరాలో ఇరుక్కుపోయి మృతదేహాలను వెలికి తీయడానికి రెండు గంటల సమయం పట్టింది. క్రేన్ల సహాయంతో ఒక్కొక్కటిగా బయటికి తీశారు. వాహనంలో ఎంతమంది ఉన్నారనే విషయంలో మొదట పోలీసులు అంచనాకు రాలేకపోయారు. అన్ని మృతదేహాలను వెలికి తీసిన తర్వాత ఎనిమిది మంది చనిపోయినట్లు నిర్ధారించారు.
ఆటోల్లో మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాలు
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆటోల్లో మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి తీసుకెళ్లారు. పరీక్షలు పూర్తి చేసిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘోర ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి హరీశ్ రావు గాంధీ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను ఓదార్చారు.
డీసీఎం ఎంత కారణమో.. టోల్గేట్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా అంతే కారణం
ఈ సందర్భంగా ప్రమాదం చోటు చేసుకోవడానికి వెనక నుంచి వచ్చిన డీసీఎం ఎంత కారణమో.. టోల్గేట్ నిర్వాహకుల నిర్లక్ష్యమూ అంతే ఉందని బాధిత బంధువులు మంత్రికి మొరపెట్టుకున్నారు. టోల్ గేట్ సమీపించడానికి కొద్ది దూరంలో అప్రమత్తం చేసే సూచనలు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొంటున్నారు.
మృతి చెందిన వారంతా యువకులే
ఈ ఘటనలో మృతి చెందిన వారంతా యువకులు కావడంతో సదాశివపేట తల్లడిల్లిపోయింది. ఎంతో సరదాగా కలిసి మెలిసి ఉండే మిత్రులంతా ఘటనాస్థలంలోనే ప్రాణాలు వదలడంతో పేట వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా మృతులంతా మైనార్టీ కుటుంబాలకు చెందిన వారే. దీంతో వ్యాపారాలు సైతం దుకాణాలు అన్ని మూసివేసి తమ సంతాపం ప్రకటించారు.
సూత్తారిగూడ టోల్ గేట్ వద్ద లోపాలు
ఒకటోల్ గేట్ వద్ద కనీసం రెండు, మూడు కిలోమీటర్ల నుంచి సూచికలతో వాహనాల వేగాన్ని తగ్గించుకోవాలని బోర్డులు ఉంటాయి. రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు ఉండాలి. మూడు కిలోమీటర్ల దూరం నుంచి రేడియం స్టిక్కర్ రిఫ్లెక్టర్లు ఉండాలి. హెచ్చరికలు ఇచ్చే బ్లింకర్స్లు ఏర్పాటు చేయాలి. కానీ ప్రమాదం చోటు చేసుకున్న ఇవేమి లేవు.