హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టోటల్ ఢమాల్: ఎక్కడ ఎంత తగ్గింది?
Hyderabad Real estate: ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్గా చెప్పాలంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదనంగా మూడువేల మంది సిబ్బందినీ దీనికి కేటాయించింది.

మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, కూకట్పల్లి నల్లచెరువు, మాదాపూర్ తుమ్మిడికుంట వంటి లేక్స్, వాటి ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్మెంట్లను ఇప్పటికే కూల్చివేస్తూ వస్తోన్నారు హైడ్రా అధికారులు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ సెంటర్ సైతం దీనికి మినహాయింపు కాదు.
ఈ పరిణామాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేసినట్టే కనిపిస్తోంది. ఏ ఇల్లు ఏ చెరువులో కట్టారో.. ఏ అపార్ట్మెంట్ ఏ కుంటలో నిర్మితమైందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ. ఫలితంగా- లక్షల రూపాయలను ధారబోసి ఇళ్లు, ప్లాట్లను కొనుగోలు చేయడానికి సాహసించట్లేదు సాధారణ ప్రజలు.
సొంతిల్లు అనేది- జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశంగా భావిస్తారు మధ్యతరగతి కుటుంబీకులు. లక్షల రూపాయలు పెట్టి కొన్న ఇంటికి ఈఎంఐలు కట్టడానికే సగం జీవితం అయిపోతుందనే భావన సహజంగానే వారిలో ఉంటుంది. ఇల్లు, ఫ్లాట్ కొనాలనే కోరిక, చేతిలో చాలినంత డబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు ముందుకు రావట్లేదు. దీనికి కారణం హైడ్రా చేపట్టిన కూల్చివేతలేననే అభిప్రాయం ఉంది.

హైదరాబాద్ సహా ఇతర మెట్రో నగరాల్లో ఇళ్లు/ ప్లాట్ల అమ్మకాలపై ప్రాప్ ఈక్విటీ సంస్థ నిర్వహించిన ఓ సర్వే- ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం అంటే జులై- సెప్టెంబర్ మధ్యకాలంలో హైదరాబాద్లో ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లల్లో 42 శాతం మేర తగ్గుదల కనిపించినట్లు పేర్కొంది.
2023 జులై- సెప్టెంబర్ మధ్యకాలంలో మొత్తం 25,370 నివాసాలు అమ్మకానికి రాగా 20,658 మంది అమ్ముడుపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో విక్రయమైన ఇళ్ల సంఖ్య 12,082 మాత్రమే. గత ఏడాదితో పోల్చుకుంటే 42 శాతం మేర తగ్గుదల నమోదైంది. దీనికి ప్రధాన కారణం హైడ్రా కూల్చివేతలేననే అభిప్రాయాలు ఉన్నాయి.
హైదరాబాద్తో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, నవీ ముంబై, థానె, పూణె, బెంగళూరు, చెన్నై, కోల్కతల్లో ఈ సర్వే నిర్వహించింది ప్రాప్ ఈక్విటీ. అత్యధికంగా హైదరాబాద్లో 42 శాతం మేర ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. బెంగళూరు- 26, కోల్కత- 23, పుణే- 19, చెన్నై- 18, ముంబై- 17, థానె- 10 శాతం మేర తగ్గుదల నమోదైంది.
A 42% crash in Hyderabad's housing market in just Q3! From a booming metropolis to a city in crisis, thanks to CM Revanth Reddy's disastrous administration; RR Tax and mad demolition drives
— KTR (@KTRBRS) September 25, 2024
Investors are backing off, and the people of Hyderabad are suffering
What was once… pic.twitter.com/bgbMBESg7q
దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మూడ నెలల్లో హైదరాబద్ రియల్ ఎస్టేట్ తిరోగమనం పట్టిందని, దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. మిగిలిన మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో ఈ దుస్థితి తలెత్తడానికి ఆర్ ఆర్ ట్యాక్స్, ఇష్టానుసారంగా చేపట్టిన కూల్చివేతలేనని అన్నారు.
దేశం మొత్తానికీ తలమానికంగా ఉంటూ వచ్చిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులెవరూ ముందుకు రావట్లేదని వ్యాఖ్యానించారు. దీనివల్ల హైదరాబాద్ అభివృద్ధి తగ్గుముఖం పడుతుందని, రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications