బాలుడి హత్య: గోనెసంచిలో తెచ్చి ఇంటి వద్ద పడేశారు
ఆదిలాబాద్: జిల్లాలోని మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. యూకేజీ చదువుతున్న ఐదేళ్ల వినయ్ అనే బాలుడు దారుణ హత్యకు గురైయ్యాడు. శనివారం ఉదయం దుండగులు బాలుడి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి అతడి ఇంటి ముందు పడేశారు.
బాలుడు మే 14న అదృశ్యమైయ్యాడు. అపహరణకు గురైనట్లు గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే బాలుడు శవమై కనిపించాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
కాగా, బాలుడి మృతదేహాన్ని చూసిన తల్లి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న మంచిర్యాల ఏఎస్పీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నాలుగేళ్ల కిందట వినయ్ తండ్రి కూడా ఇదే తరహాలో హత్యకు గురయ్యారు.
బాలుడి హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.