విషాదం: రెండో తరగతి విద్యార్థినిని హింసించిన టీచర్, తలపై స్కేలుతో కొట్టడంతో మృతి
నిజామాబాద్: కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను శిక్షిస్తున్న తీరు మొత్తం గురువులకే చెడ్డపేరు తెచ్చేలా మారుతోంది. తాజాగా, ఓ టీచర్.. హోంవర్క్ చేయలేదనే నెపంతో ఓ విద్యార్థిని తలపై స్కేలుతో గట్టిగా కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నారై కాలనీలో చోటు చేసుకుంది.
అర్సపల్లికి చెందిన ఏడేళ్ల ఫాతిమా ఎన్నారై కాలనీలోని ఓ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. సెప్టెంబర్ 3న ఫాతిమా హోంవర్క్ చేయలేదని టీచర్.. ఆమెను తరగతి గదిలో సుమారు రెండు గంటలపాటు బెంచీపై నిలబెట్టారు. అంతేగాక, స్కూల్ బ్యాుగులో పుస్తకాలు ఉంచి బాలిక మెడలో వేసి మోయించారు. అంతటితో కూడా ఆగకుండా చిన్నారి తలపై స్కేలుతో బలంగా కొట్టారు ఆ దుర్మార్గపు టీచర్.
ఈ క్రమంలో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే తల్లిదండ్రులు ఫాతిమాను ఆస్పత్రికి తరలించగా.. తలలో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఫాతిమా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో ఫాతిమా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఫాతిమాను కొట్టిన టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి ముజీబ్ ఖాన్ నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి ఫాతిమా మృతి చెందిన వార్త తెలుసుకున్న డీఈఓ.. పాఠశాలను మూసివేయించారు. చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించిన టీచర్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.