బీఆర్ఎస్ ఛలో మేడిగడ్డ బస్సు యాత్రలో అపశృతి
BRS Chalo Medigadda: భారీ నీటి ప్రాజెక్టులు కేంద్రబిందువుగా.. తెలంగాణలో లోక్సభ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. ఒకరిపైఒకరు విమర్శలు సంధించుకుంటోన్నారు. దీనికి- బస్సు యాత్రలు తోడు కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
గతంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న అవినీతిని బయట పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఇదివరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ బ్యారేజీకి పగుళ్లు రావడం, గేట్లు కుంగిపోవడం కలకలం రేపింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ నాయకులు భారీగా ముడుపులు తీసుకున్నారని, సుదీర్ఘకాలం పాటు మనుగడ సాగించాల్సిన ప్రాజెక్టుల నిర్మాణంలో నాసిరకంగా సామాగ్రిని ఉపయోగించడం వల్ల ఈ దుస్థితి తలెత్తిందంటూ ఎదురుదాడికి దిగింది కాంగ్రెస్ పార్టీ. దీనిపై విచారణకూ ఆదేశాలను ఇచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు స్వయంగా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్ట్ను సందర్శించారు. పగుళ్లను స్వయంగా పరిశీలించారు. ఇప్పుడు అదే మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడానికి బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. ఇతర నాయకులు ఈ టీమ్లో ఉన్నారు.
చలో మేడిగడ్డ నినాదంతో బయలుదేరి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తోన్న బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. మల్టీ యాక్సిల్ ఏసీ బస్సు అది. వెనుక వైపు టైర్ మొత్తం పెద్ద శబ్దం చేస్తూ పేలింది. టైర్ మొత్తం ఛిద్రమైంది. ఫలితంగా మార్గమధ్యలోనే బస్సు స్తంభించింది.
ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. టైరు పేలిన సమయంలో బస్సు వేగం నామమాత్రంగా ఉందని, అందుకే చిన్నపాటి ప్రమాదంతో బయటపడ్డామని పేర్కొన్నారు. దగ్గరలో ఉన్న మెకానిక్ను పిలిపించి టైరును మార్పించారు.












Click it and Unblock the Notifications