నిరంకుశత్వం: పాల కోసం ఏడ్చి చిన్నారి మృతి

మెదక్: పొట్ట కూటి కోసం కూలీ పనికి వచ్చిన ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఉపాధి కోసం తన పిల్లలతో సహ ఓ పేద మహిళ వలస వచ్చి పరిశ్రమలో పనికి కుదిరింది. ఆ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నిరంకుశత్వానికి ఆరు నెలల పసికందు బలయ్యాడు. పాల కోసం గుక్కపట్టి ఏడ్చీ ఏడ్చీ ప్రాణాలొదిలాడు. మహిళ తన కొడుక్కి పాలిచ్చేందుకు కూడా ఆ కాంట్రాక్టర్ అనుమతించకపోవడంతో ఆ పసికందు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే.. పాలమూరు జిల్లా నవాబ్‌పేట్‌ మండలం కాకర్లపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి వలస కూలి. ముగ్గురు కూతుళ్లు, ఆరు నెలల బాబును పట్టుకొని పని కోసం వచ్చింది. పనికి పోకపోతే బాబు పాలకు ఇబ్బందని ఆ బాలింత ఆ స్థితిలోనే భవన నిర్మాణ పనులకు కుదురుకుంది. భర్తతో గొడవ పడి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఈ స్థితిలో మెదక్‌ జిల్లా హత్నూర మండలం తుర్కలఖానాపూర్‌ శివారులోని ఓ పరిశ్రమ వద్ద పని చేయించడం కోసం మల్లీశ్వరి సహా అనేకమంది కూలీలను మహబూబ్‌నగర్‌ నుంచి ఓ కాంట్రాక్టర్‌ తీసుకొచ్చాడు.

పరిశ్రమ విస్తరణ పనుల్లో భాగంగా కొన్ని కొత్త నిర్మాణాలు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఫిబ్రవరి 7న మల్లీశ్వరి పనిలో దిగింది. బాబును చూసేవారు లేకపోవడంతో వెంట తీసుకొచ్చింది. పని చేస్తున్న చోటుకు దగ్గర్లోని ఓ గుడిసెలో బిడ్డను పడుకోబెట్టి వచ్చింది. పని జరుగుతుండగా బిడ్డ ఏడుపు వినిపించింది. పాలు ఇచ్చి వస్తానని కాంట్రాక్టర్‌ను అడగడానికి మొదట మల్లీశ్వరి జంకింది. అంతకంతకూ బాబు ఏడుపు పెరగడంతో మల్లీశ్వరి ఆగలేకపోయింది. కాంట్రాక్టర్‌ దగ్గరకు పోయి వేడుకుంది. అతడు ఒప్పుకోలేదు. ‘ఎక్కువ సేపు ఉండను. అలా పాలిచ్చి ఇలా వెంటనే వచ్చేస్తాను' అని ప్రాధేయపడినా ససేమిరా అన్నాడు.

A child allegedly died in Medak district

‘ పని పూర్తి చేసి కదులు' అని హూంకరించాడు. ఇదంతా జరుగుతుండగానే బాబు పెద్దగా ఏడుపు లంఘించుకొన్నాడు. తల్లి మనసు కొట్టుమిట్టాడింది. ఎంతకూ ఏడుపు ఆగడం లేదు. తల్లి కళ్లెంట కూడా కన్నీరు ధారలు కట్టింది. ఇంతలో.. ఒక్కసారిగా నిశ్శబ్దం! అప్పటికే బిడ్డ ఉన్న గుడిసె వైపు కాళ్లు కదిలిస్తున్న ఆ తల్లి.. ఇక ఆగలేకపోయింది! ఒక్క ఉదుటున గుడిసె దగ్గరకు పరుగు తీసింది. బాబును దగ్గరకు లాక్కొని చూసింది. చిన్నారి మృతిచెందాడు. దీంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆమె రోదించిన తీరును అక్కడున్న వారిని కలిచివేసింది.

సదరు కాంట్రాక్టర్ ఈ విషయం బయటకు పొక్కకుండా పరిశ్రమలో ఇసుక, కంకర సరఫరా చేసే సబ్‌కాంట్రాక్టర్ సహాయంతో చిన్నారి శవం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని శ్మశానవాటికలో పూడ్చివేశారు. కాంట్రాక్టర్ నిరంకుశ ధోరణితోనే బిడ్డకు పాలు ఇవ్వకుండా చేశారని, తన బాబు చనిపోవడానికి అతడే కారణమని న్యాయం చేయాలని తల్లి రోదించసాగింది. ఈ విషయం బయట తెలిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పరిశ్రమ యాజమాన్యం మల్లీశ్వరితో పాటు, ఇతర కూలీలను బలవంతంగా బయటకు పంపించేశారు.

అంతేకాదు ఎక్కడైనాచెబితే చంపేస్తామని ఆమెను సదరు కాంట్రాక్టర్ బెదిరించినట్లు తెలిసింది. దిక్కుతోచనిస్థితితో ఆమె బోరున విలపిస్తూ ఇంటికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై పరిశ్రమ జనరల్ మేనేజర్ శశికుమార్‌ను వివరణ కోరగా తనకు సంబంధం లేదని, దీనిపై విచారించి కాంట్రాక్టర్‌ను తొలగిస్తామని తెలిపారు.

సోమవారం జిల్లాలోని హత్నూర మండలం తుర్కలకానాపూరలోని ఈఎంఆర్‌ కెమికల్‌ ఫ్యాక్టరీని తహశీల్దార్‌ ప్రతాప్‌రెడ్డి, సీఐ రాంరెడ్డి సందర్శించారు. పసిపాప మృతిపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తహశీల్దార్‌ తెలిపారు. కాంట్రాక్టర్‌పై విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. బాధిత తల్లి నుంచి వివరాలు తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+