కేటీఆర్ కాన్వాయ్పై చెప్పుతో దాడి చేసిన రైతు: పోలీస్ స్టేష్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి విసిరాడు
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాల నాయకులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
అయితే, ఎలాంటి తప్పు చేయకున్నా అకారణంగా అరెస్టులు చేయడం అన్యాయమని పలువురు రైతు సంఘాల నాయకులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెట్పల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై చెరకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి చెప్పు విసిరారు.
ముందస్తుగా అరెస్ట్ అయి మెట్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న నారాయణ రెడ్డి స్టేషన్ ముందు నుంచి కేటీఆర్ కాన్వాయ్ వెళ్లడం గమనించి పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు. అయితే, ఈ ఘటనను అక్కడున్న కొందరు రైతు నేతలు వీడియోలు తీశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఇది ఇలావుండగా, ఇటీవల మంత్రి మల్లారెడ్డిపై రెడ్డి సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, చెప్పులు, రాళ్లు, బాటిళ్లు, చైర్లు.. ఇలా ఏది పడితే అది మంత్రి కాన్వాయ్పైకి విసిరారు. ఈ దాడి ఘటన జరిగిన తర్వాత.. ఇప్పుడు అలాంటి అనుభవమే మంత్రి కేటీఆర్కు కూడా ఎదురుకావడం గమనార్హం.