మట్టి పెళ్లలు మీద పడి రైతు దుర్మరణం: కన్నీరుమున్నీరైన భార్య, పిల్లలు
ఉపాధిహామీ పథకంలో మంజూరైన వ్యవసాయ బావిని తవ్వుతుండగా ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు మీద పడటంతో బయ్య రమేశ్(35) అనే రైతు దుర్మరణం పాలైన విషాద సంఘటన నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెంలో సోమవారం ఉదయం చోటు చేసుకు
నల్లబెల్లి: ఉపాధిహామీ పథకంలో మంజూరైన వ్యవసాయ బావిని తవ్వుతుండగా ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు మీద పడటంతో బయ్య రమేశ్(35) అనే రైతు దుర్మరణం పాలైన విషాద సంఘటన నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రగూడెం గ్రామానికి చెందిన బయ్య బుచ్చమ్మ, మల్లయ్యలకు రమేశ్ ఒక్కగానొక్క కుమారుడు.
రమేశ్కు గత పదిహేనేళ్ల క్రితం రేణుకతో వివాహమైంది. వీరికి ప్రదీప్(తొమ్మిదో తరగతి), వినయ్(నాలుగో తరగతి) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. వారికున్న రెండెకరాల పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటు రమేశ్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా వ్యవసాయ పనులకు నీటి సాగు కోసం ఇటీవల ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావి మంజూరైంది.
గత వారం రోజులుగా ఉపాధి కూలీలతో వ్యవసాయ బావిని తన పొలంలో తవ్విస్తున్నాడు. సోమవారం ఉదయం కూలీల సాయంతో బావి తవ్వుతుండగా బాధిత రైతు వారితో పాటు మట్టిని తొలగిస్తున్నాడు. ఒక్కసారిగా తవ్విన మట్టిపెళ్లలు విరిగి రమేశ్ మీద పడటంతో వాటి కింద ఇరుక్కున్నాడు. స్పందించిన తోటి కూలీలు మట్టి పెళ్లలు తొలగించడంతో అప్పటికే రమేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. మట్టిపెళ్లల బరువుకు రమేశ్కు దేహం ఛిద్రమైంది.
సంఘటనలో మేడమీది రాజు, ఓరగంటి సాంబయ్య అనే ఇద్దరు కూలీలు గాయాలపాలయ్యారు. మృతుడి భార్య అక్కడే ఉంది. కళ్ల ముందే భర్త ప్రమాదవశాత్తు మృతిచెందడంతో జీర్ణించుకోలేక గుండెలు బాదుకుంటూ రోదించింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం విషయం తెలియగానే గ్రామస్థులు సంఘటన స్థలానికి తరలివచ్చారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ప్రమాద సంఘటనలో మృతి చెందడంతో కంటతడి పెట్టారు.
వృద్ధులైన తల్లిదండ్రులకు కన్నపేగు తెంచినట్లైందని, కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని గ్రామస్థులు ఆవేదన చెందారు. పాఠశాలకెళ్లిన ఇద్దరు కుమారులను సంఘటన స్థలానికి తీసుకురావడంతో చిన్నారులు తండ్రిని విగతజీవిగా ఉండటం చూసి రోదించారు.
'మానాన్న బతికే ఉన్నాడా..' అంటూ చిన్న కుమారుడు అడగటం చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై రాజమౌళి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని నర్సంపేటలో శవ పంచనామా చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.