ప్రాణం తీసిన ఉయ్యాల: తాడు మెడకు చుట్టుకుని ఎంపిపి కొడుకు మృతి
ఆదిలాబాద్: జిల్లాలోని దండేపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉయ్యాల ఊగుతూ ఓ 11ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఉయ్యాల ఊగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారడంతో తాడు మెడకు చుట్టుకుంది. దీంతో అతడికి ఊపిరాడలేదు. కొంతసేపటి వరకు గిలాగిలా కొట్టుకున్న అతడు అక్కడే ప్రాణాలు వదిలాడు.
వివరాల్లోకి వెళితే.. దండేపల్లి ఎంపిపి కుమారు రుషి(11) తన ఇంటి సమీపంలో ఉయ్యాల ఊగుతూ ఉన్నాడు. ఉయ్యాలపై నిల్చుని ఊగుతుండటంతో అతని కాలు జారింది. దీంతో ఉయ్యాల తాడు అతని మెడకు గట్టిగా చుట్టుకుంది. అతనికి సాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేకపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

కాసేపటికి గమనించిన స్థానికులు ఎంపిపి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న ఎంపిపి కుటుంబసభ్యులు అతడి మెడకు చుట్టుకున్న తాడును తొలగించారు. ఆస్పత్రికి తరలించాలని యత్నించినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు వదలడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇది ఇలా ఉండగా, దండేపల్లిని మంచిర్యాల జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎంపిపి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై ఎవరూ లేరు. ఎంపిపి కూడా బంద్లో పాల్గొన్నారు. ఇది కూడా పరోక్షంగా బాలుడి మృతికి కారణమైనట్లు తెలుస్తోంది. బంద్ లేకపోయి ఉంటే బాలుడు ఉయ్యాల ఊగుతున్న ప్రాంతంలో కొంత రద్దీగా ఉండే అవకాశం ఉండేది. బంద్ కావడం వల్ల ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో బాలుడ్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications