దారుణం: భార్యపై మరిగే నీటిని పోసిన భర్త, చికిత్స పొందుతూ మృతి
వరంగల్: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో గొడవపడిన ఓ భర్త.. ఆగ్రహానికి గురై తన భార్యపై సలసల మరిగే నీటిని పోశాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.
ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి భర్త మద్యానికి బానిసై తరచూ చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు.
అయితే బుధవారం వీరిద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన భర్త.. ఆమెపై మరిగే నీటి పోశాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడితో కోసం గాలింపు చేపట్టారు.
మైనర్ బాలిక అనుమానాస్పద మృతి
మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలిక అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైంది.
ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నల్గొండ జిల్లా నారాయణపురం మండలం కోతలపురం గ్రామానికి చెందిన సిరిరెండ్ల కృష్ణవేణి(17) తల్లి తండ్రులతో పాటు పరకాల మండలానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో కాలి బూడిదైంది. దీంతో ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైనా కిరోసిన్ పోసి నిప్పంటించారా? అని అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.