వివాహేతర సంబంధం: 3 ఏళ్ళ కొడుకును చంపిన తల్లి
కట్టుకున్న భర్తను వదిలేసిన ఓభార్య.. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మూడేళ్ల చిన్నారిని చంపేసింది. తన కొడుకును తనకివ్వాలని భర్త కోరినా కానీ, ఆమె ఇవ్వలేదు. పైగా చంపేసింది.
వనపర్తి : కట్టుకున్న భర్తను వదిలేసిన ఓభార్య.. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మూడేళ్ల చిన్నారిని చంపేసింది. తన కొడుకును తనకివ్వాలని భర్త కోరినా కానీ, ఆమె ఇవ్వలేదు. పైగా చంపేసింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం కొట్టాల్గడ్డ గ్రామానికి చెందిన నర్సింహగౌడ్కు అదే మండలం పాలెం గ్రామానికి చెందిన పద్మతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. నర్సింహగౌడ్ వికలాంగుడు . గ్రామంలో కల్లు దుకాణం నిర్వహిస్తూ వచ్చే ఆదాయంతోపాటు వికలాంగ పింఛన్తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి మీనాక్షి(6), కార్తీక్(3) సంతానం ఉన్నారు. భార్య పద్మ పాలెం అగ్రికల్చర్ యూనివర్శిటీలో దినసరి కూలీగా పనిచేసేది. అక్కడే పనిచేస్తున్న మల్లేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయాన్ని తెలుసుకున్న భర్త నర్సింహగౌడ్ పద్ధతి మార్చుకోవాలని సూచించినా ఆమెలో మార్పురాలేదు.
రెండు నెలల క్రితం భర్తను వదిలి ఇద్దరు పిల్లలతోపాటు మల్లేష్తో కలిసి వనపర్తిలోని శంకర్గంజ్ కాలనీలో అద్దెగదిలో ఆమె నివాసం ఉంటోంది. పద్మ శనివారం ఉదయం కార్తీక్(3) అనారోగ్యంతో మృతి చెందాడని మృతదేహాన్ని తీసుకుని అత్తారింటికి కొట్టాల్గడ్డకు వెళ్లింది. దీంతో భర్త నర్సింహగౌడ్, అతని కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి బాబు ఎలా చనిపోయాడో చెప్పాలని.. పాప మీనాక్షి ఎక్కడ ఉందని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పింది.
దీంతో నర్సింహగౌడ్, కుటుంబ సభ్యులు పాపను కూడా చంపివేసిందన్న అనుమానంతో కార్తీక్ మృతదేహాంతో పాటు పద్మను వాహనంలో ఎక్కించుకొని పాపను చూయించాలని కొట్టాల్గడ్డ నుంచి బయలుదేరారు. కర్నూలు తదితర ప్రాంతాలను తిప్పించి చివరికి వనపర్తిలోనే పాప ఉందని చెప్పడంతో వారు వనపర్తికి వచ్చారు. మల్లేష్ దగ్గర ఉన్న పాప మీనాక్షిని తమతో తీసుకుని మల్లేష్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కార్తీక్ గొంతు నులిమి చంపేశారని నర్సింహగౌడ్ ఫిర్యాదు చేశారు.