పెద్దలు మందలించారని ప్రేమజంట ఆత్మహత్య
ఖమ్మం: జిల్లాలోని కారేపల్లి మండలం మేకల తండాలో విషాదం నెలకొంది. ప్రేమించుకుంటున్న విషయం పెద్దలకు తెలియడంతో వారు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మేకల తండాకు చెందిన జాటోత్ యాకూబ్ (18), గుగులోత్ రేణుక(17) ప్రేమించుకున్నారు. యాకూబ్ కూలీగా పనిచేస్తుండగా, రేణుక ఎనిమిదో తరగతి చదువుతోంది. గురువారం ఇద్దరూ మాట్లాడుకుంటుండగా రేణుక పెద్దనాన్న చూసి మందలించాడు.
ఆందోళనకు గురైన యాకూబ్ గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద ప్యాసింజర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి రేణుక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి మరణాలతో వారి ఇరుకుటుంబాల్లో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల సమక్షంలోనే నేరస్థుడ్ని కొట్టి చంపారు
రంగారెడ్డి: పోలీసుల సమక్షంలోనే పాత నేరస్థుడ్ని కొట్టి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బండమీది పల్లిలో గురువారం రాత్రి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఓ కార్యక్రమంలో భాగంగా బుగ్గప్ప అనే నేరస్థుడ్నిపోలీసులు తమ వెంట అతని ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం స్టేషన్కు తరలిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు కాపుకాసి బుగ్గప్పపై దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బుగ్గప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పోలీసుల సమక్షంలో జరిగినా వారు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.