‘నీ నగ్న చిత్రాలు నెట్లో పెడతా’: కట్టుకున్న భార్యకు భర్త వేధింపులు
హైదరాబాద్: కట్నం కోసం కట్టుకున్న భార్యకు నరకం చూపాడు ఓ భర్త. తను అడిగినంత కట్నం తీసుకురాకపోతే ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండా తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు.
ఈ నేపథ్యంలో ఆ ఎన్నారై భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన్ను భారత్కు రప్పించాలంటూ బుధవారం సాయంత్రం కిషన్బాగ్, చిరాగ్అలీ నగర్కు చెందిన ఇష్రాత్ బేగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కేసు విచారణకు స్వీకరించిన కమిషన్ జులై 19 లోపు నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖకు ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. తాడ్బన్, బషారత్నగర్, రంజన్ కాలనీకి చెందిన మిర్జా ఖాలీద్ అలీ బేగ్ తనయుడు, ప్రస్తుతం ఖతార్లో ఇంజినీర్గా పని చేస్తున్న మిర్జా అర్షద్ అలీ బేగ్తో పది నెలల క్రితం తనకు పెద్ద సమక్షంలో వివాహమైందని బాధితురాలు కమిషన్కు వివరించింది. భర్త అర్షద్ అలీ బేగ్ తనను ఖతార్ రావాలంటూ వీసా పంపించారని, అక్కడకు వెళ్లాక ఆయన నిజస్వరూపం బయట పడిందన్నారు.

కారు కొనుక్కోవడానికి రూ.2 లక్షలు ఇవ్వాలంటూ వేధించాడని, అవి ముట్టజెప్పాక మళ్లీ రూ.3 లక్షలు అడిగాడని, ఇలా ఎప్పటికప్పుడు తన గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవడానికి తనను వేధించడం మొదలుపెట్టాడని కమిషన్ ముందు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
తన తండ్రి పరిస్థితి బాగా లేదని, ఇంకా డబ్బు ఇవ్వలేరని చెప్పడంతో 'పడక గదిలో నీకు తెలియకుండా తీసిన కొన్ని చిత్రాలు నా దగ్గరున్నాయి. వాటిని సామాజిక మధ్యమాల్లో అప్లోడ్ చేస్తాన' అంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది. అంతేగాక, భర్త కొట్టడం వల్ల తనకు గర్భస్రావం అయిందని చెప్పింది. అతని హింస భరించలేక స్వదేశానికి వచ్చానని పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ హెచ్చార్సీని వేడుకుంది.












Click it and Unblock the Notifications