వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా?: మేస్త్రీ దారుణ హత్య
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ సమీపంలోని ఫతుల్లాగూడలో నివసించే తన్నీరు వెంకటేష్(35), సుశీల దంపతులు. పదమూడేళ్ల క్రితం వివాహం జరిగింది.
ఈ ఇద్దరి స్వస్థలం ప్రకాశం జిల్లా కొండెపి మండలంలోని సంతనూతలపాడు గ్రామం. వెంకటేష్ వృత్తిరీత్యా మేష్త్రీ. కాగా, ఇంటికి సమీపంలోనే కిరాణదుకాణం నడుపుతున్నారు. స్థానికంగా గతంలో పాల వ్యాపారం చేసి.. ప్రస్తుతం మందులు అమ్ముతున్న అనిల్తో సుశీలకు వివాహేతర సంబంధం ఉందంటూ వెంకటేష్ ఆమెతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో 20 రోజుల క్రితం అనిల్ను ఇంటికి పిలిపించిన సుశీల తన భర్తతో పంచాయతీ పెట్టింది. ఈ సందర్భంగా వెంకటేష్ ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో స్థానికులు స్పందించి రక్షించారు. గొడవల నేపథ్యంలో సుశీల తన పిల్లలతో సహా పది రోజుల క్రితం సొంతూరికి వెళ్లింది.

కాగా, గురువారం ఉదయం 6గంటల సమయంలో సుశీల ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో మంచంపై వెంకటేష్ హత్యకు గురై ఉన్నాడు. దీంతో సుశీల ఎల్పీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ ఏసిపి వేణు గోపాలరావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై సుదర్శన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు.
పదునైన ఆయుధంతో తల వెనుకభాగంలో బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మంచంపైనే మృతిచెందివున్నాడు వెంకటేష్. ఇంటి పరిసరాల్లో తిరిగిన పోలీసు జాగిలం.. ఆనంద్ నగర్ చౌరస్తాలోని బార్లోకి వెళ్లి కలియ తిరిగింది. దుండగులు బుధవారం రాత్రి బార్లోమద్యం తాగి వచ్చి ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
బార్లో ఉన్న సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుండగులు అనిల్ సంబంధీకులో.. లేక సుశీల బంధువులో అయివుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించారు. కాగా, అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అతడు రెండ్రోజులుగా విశాఖపట్నంలో ఉంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications