తండ్రి కాదు, కామపిశాచి: భార్యను గదిలో బంధించి, కూతురిపై రేప్
హైదరాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు.. కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన కాలాపత్తర్ తాడ్బన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. కాలాపత్తర్ తాడ్బన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పదమూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది. వీరికి ప్రస్తుతం 12 సంవత్సరాల కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా మూడు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు.
విడాకులు ఇచ్చినా.. భార్య వద్దకు అతడు అప్పుడప్పుడు వెళుతుండేవాడు. సెప్టెంబర్ 24వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిన అతడు.. ఆమె ఉన్న గదికి బయట గడియపెట్టాడు.
ఆ తర్వాత మరో గదిలో ఉన్న కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లికి సోమవారం చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వృద్ధురాలి హత్య కేసులో దోషికి జీవితఖైదు
తాగిన మైకంలో డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఇంటి ముందు ఒంటరిగా నిల్చున్న వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన దోషికి న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టీవీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా హుజూర్నగర్ మండలం మేళ్లచెరువుకు చెందిన పార్శపు రుక్మారావు, సంపూర్ణ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలసి పదేళ్ల క్రితం నగరానికి వచ్చి కొత్తపేట న్యూమారుతీనగర్లో అద్దెకు ఉంటున్నారు.
తాగుడుకు బానిసైన రుక్మారావు నిత్యం భార్యతో గొడవ పడేవాడు. చివరికి భార్యను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 2015 ఫిబ్రవరి 5న పూటుగా తాగి భార్యను చంపాలని కత్తి తీసుకొని ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే ఇద్దరు పిల్లలను చూసి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొని మళ్లీ తాగి వచ్చి కాలనీలో తచ్చాడుతున్నాడు. అదే కాలనీలో ఉంటున్న ఏపీపీఏస్సీలో కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన కాశిబట్ల లక్ష్మీగణపతి శర్మ భార్య వెంకటలక్ష్మీ(65) ఇంటి గుమ్మం వద్ద ఒంటరిగా నిల్చుండడం రుక్మారావు గమనించాడు.
వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి కత్తితో డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతడిని ప్రతిఘటిస్తూనే ఇంట్లోకి పరుగెడుతుండగా ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపాడు రుక్మారావు. గమనించిన స్థానికులు నిందితుడిని వెంటాడి పట్టుకొని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించారు. అనంతరం అతడిపై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.