అమాయక యువతులు, మహిళలే టార్గెట్: జాబ్ పేరుతో దోపిడీ, అత్యాచారాలు, వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: నగరానికి వచ్చే అమాయక ఒంటరి మహిళలు, యువతులు, విద్యార్థినులను ఉపాధి, ఉద్యోగాల పేరుతో నమ్మించి కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి బెదిరించి వారి బంగారు నగలను తీసుకోవడం, మరికొందరిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ ప్రకాష్రెడ్డి, బొల్లారం, గోపాలపురం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు సత్తయ్య, రఘునాథ్లు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఘట్కేసర్ మండలం, వెంకటాద్రి టౌన్షిప్, చౌదరిగూడ ప్రాంతానికి చెందిన హుస్సేన్ఖాన్(40) ప్లంబర్గా పనిచేస్తుంటాడు.
ఆ తర్వాత విలాసాలకు అలవాటు పడి చోరీలు మొదలుపెట్టాడు. నగరంలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. 2007లో నల్లకుంట పోలీసులకు చిక్కి జైలుకెళ్లి వచ్చాడు.
అయినా, ప్రవర్తన మార్చుకోకుండా రైల్వేస్టేషన్, బస్స్టాండ్లు, ఆస్పత్రుల వద్ద కాపుగాసి గ్రామాల నుంచి వచ్చే మహిళలు, యువతులు, విద్యార్థినులకు ఉపాధి, ఉద్యోగాలు, ఉపకారవేతనాల పేరిట నమ్మబలికి తన కారులో ఎక్కించుకొని ఘట్కేసర్, నారపల్లి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు.
వారిని బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారు నగలను లాక్కునేవాడు. కొందరిని బెదిరింపులకు గురిచేసి అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. ఈ తరహాలో గోపాలపురం, తుకారాంగేట్, చిలకలగూడ, కార్ఖానా, ఘట్కేసర్ తదితర ఠాణాల్లో 6కేసులు నమోదయ్యాయి. డీసీపీ ఆదేశాల మేరకు ఎస్సై కిషోర్, భాస్కర్రెడ్డిల ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నిందితుణ్ని పట్టుకుంది.
రూ.7లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఒక మారుతి ఆల్టో కారు, హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 40 నుంచి 50 మంది మహిళలను ఈ తరహాలో మోసగించినట్లు హుస్సేన్ఖాన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇతనికి సహకరించిన గౌస్ను ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.