భార్య కాపురానికి రాలేదని టవరెక్కిన భర్త
మహబూబ్నగర్: తన భార్య కాపురానికి రాలేదంటూ ఓ భర్త మద్యం మత్తులో బిఎస్ఎన్ఎల్ టవరెక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లోని కొల్లాపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని చుక్కాయపల్లి కాలనీకి చెందిన మద్దెల మధు(30)కి పద్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
నిత్యం తాగివచ్చే భర్త వేధింపులకు తట్టుకోలేని భార్య కుమారుడ్ని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మధు మానసిక ఆందోళనకు గురై తాగిన మైకంలో పట్టణంలోని గ్రంథాలయ సమీపంలోని శేషన్నగౌడ్ భవనంపై ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్పైకి ఎక్కాడు.
సమాచారం అందుకున్న ఎస్ఐ సత్యనారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని టవర్ నుంచి కిందికు దిగమని విజ్ఞప్తి చేసినా మొండికేసి కూర్చున్నాడు. అతికష్టంగా మధును కిందకు దింపిన ఎస్ఐ.. అతని వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అతన్ని కొల్లాపూర్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నిర్వహించి ఇంటికి పంపామని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రంగారెడ్డి: జిల్లాలోని పరిగి మండలం రూప్ఖాన్పేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. డీసీఎం-ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.