పెళ్లి చూపుల్లో ఓకే చెప్పి, తర్వాత రద్దు: ఆత్మహత్య చేసుకున్నాడు
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి రద్దయిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ (38) కుటుంబం పదిహేనుళ్లుగా పంజాగుట్టలోని క్రాంతి శిఖర అపార్టుమెంట్ మూడో అంతస్తులో నివాసం ఉంటోంది. ఇతను స్థానికంగా ఎడిటింగ్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు.
కాగా, రాజశేఖర్కు ఇటీవల పెళ్లి చూపులు జరిగి, ఇరువైపులా అంగీకారం కుదిరింది. అయితే పేర్లపై బలం లేదని పెళ్లి సంబంధం రద్దు చేసుకుంటున్నామని పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు.

దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్.. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జనంపైకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి
ఓ లారీ అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్లోని మియాపూర్ వద్ద జాతీయరహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి నుంచి బీహెచ్ఎల్ వెళ్తున్న లారీ మదీనగూడ వద్ద రాగానే రోడ్డుపక్కన ఉన్న ఓ నర్సరీలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమల్లి ప్రాంతానికి చెందిన ఆదినారాయణ, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగుంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications