కరోనా సోకిందని భార్యను గదిలో నిర్బంధించాడు: అసలు విషయం ఎంటంటే.?
హైదరాబాద్: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు ఓ దుర్మార్గపు భర్త. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాలేదనే కోపంతో కరోనా వచ్చిందని ఆమెను ఓ గదిలో నిర్బంధించాడు. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివారల్లోకి వెళితే.. బాధితురాలు ఓ ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగికి భార్య. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో.. పుట్టింటి నుంచి రూ. 6 లక్షలు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అయితే, తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదన్న భార్య.. అందుకు నిరాకరించింది.
ఈ క్రమంలో ఆమెను చాలా రోజులపాటు ఓ గదిలో నిర్బంధించాడు. ఇరుగుపొరుగువారు అడిగితే తన భార్యకు కరోనా సోకిందని, ఐసోలేషన్లో ఉంచానని చెప్పుకొచ్చాడు. అనుమానం వచ్చిన చుట్టుపక్కలవారు సనత్నగర్లోని మెట్రోపాలిటన్ న్యాయసేవా విభాగానికి చెందిన పుష్పలతకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆమె.. ఇంటికి వెళ్లి బాధితురాలికి విముక్తి కల్పించారు.
బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షించగా.. ఆమెకు కరోనా నెగిటివ్ అని తేలింది. ఆ తర్వాత బాధితురాలిని ఆమె పుట్టింటికి పంపారు. పోలీసులకు, కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు సూచనలతో భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో తన తప్పును తెలుసుకున్న సదరు భర్త.. తన భార్యను తిరిగి పుట్టింటికి తీసుకెళ్లాడు.
Recommended Video