తెలంగాణలో మరో పాజిటివ్..? రామగుండంలో ఆ రైలు దిగిన వ్యక్తికి కరోనా..
కరోనా.. కరోనా.. కరోనా.. రాష్ట్రంలో,దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు.. ఒకరకమైన షట్ డౌన్ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉండే మాల్స్,సినిమా థియేటర్స్,విద్యా సంస్థలను ఇప్పటికే మూసివేశాయి. విదేశాల నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాయి. అలాగే పబ్లిక్ ఈవెంట్స్,ఎక్కువమంది గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేసుకోమని సూచిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు కరోనా బారినపడుతారో తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బస్సులు,రైళ్లు,విమానాల ద్వారా రాష్ట్రానికి వస్తున్నవారిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వారి ట్రావెల్ హిస్టరీ తెలుసుకుని అసవరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా రామగుండంలో రైలు దిగిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించింది.

దీంతో అతనితో పాటు అదే కోచ్లో ప్రయాణించినవారి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వివరాలు అందించాల్సిందిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్కు లేఖ రాసింది. బాధితుడు మార్చి 13న ఢిల్లీ నుంచి బయలుదేరి ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్లోని ఎస్9 కోచ్లో ప్రయాణించి మరుసటి రోజు రామగుండం చేరుకున్నాడని లేఖలో పేర్కొంది. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని.. కాబట్టి అతనితో ప్రయాణించినవారి వివరాలు కావాలని కోరింది.

కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అయితే వారంతా విదేశాల నుంచి వచ్చినవారేనని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న సలహాలు,సూచనలు ప్రజలు పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపవద్దని అన్నారు. 200 మంది లేదా అంతకమంటే తక్కువమందితో ఫంక్షన్లు నిర్వహించుకోవాలన్నారు. మనిషికి, మనిషికి మధ్య కనీసం గజం దూరం పాటించాలన్నారు.












Click it and Unblock the Notifications