అన్నతో నిశ్చితార్థం.. తమ్ముడితో పెళ్లి: వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య?
హైదరాబాద్: నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలను వెల్లడించారు.

అన్నతో నిశ్చితార్థం.. తమ్ముడితో పెళ్లి..
హైదరాబాద్ పాతబస్తీ వట్టెపల్లికి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్ బేగం(25)తో జల్పల్లి న్యూబాబానగర్ నివాసం మీర్ ఇస్మాయిల్ ఉద్దీన్ అలీకి 28 రోజుల క్రితం వివాహం జరిగింది. కాగా, మూడేళ్ల క్రితమే ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ అన్నయ్యతో ఆమెకు నిశ్చితార్థమైంది. అనంతరం సోదరిలిద్దరూ ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లారు. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో అన్నయ్య ఇంటికి రాలేదు. నెలన్నర క్రితం తమ్ముడు ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ దుబాయ్ నుంచి తిరిగివచ్చాడు. పెద్ద కుమారుడి ఆచూకీ లేకపోవడంతో రెండు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్ బేగంను ఇస్మాయిల్ ఉద్దీన్ అలీకి ఇచ్చి జులై 12న పెళ్లి చేశారు.

నవ వధువుకు వేధింపులు.. ఆత్మహత్య..?
సోదరుడికి నిశ్చితార్థమైన అమ్మాయితో తనకు వివాహం చేశారంటూ అలీ తీవ్రంగా మదనపడేవాడు. అంతేగాక, భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించాడు. దీనికితోడు కట్నకానుకల విషయమై అత్తమామల నుంచి కూడా వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో కలత చెందిన షాహిన్ బేగం శనివారం తన గదిలోని ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మాయి ప్రేమ నిరాకరించడంతో యువకుడు బలవన్మరణం..
ఇది ఇలావుండగా, మరో ఘటనలో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మిరుదొడ్డి మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన నర్సింలు, పద్మల కుమారుడు గుర్రప్పగారి అజయ్(22) హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. ఇదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయితో అతడు ప్రేమలో పడ్డాడు. ఏడాదిపాటు ప్రేమించుకున్నవారు కరోనా నేపథ్యంలో కాలేజీ మూతపడటంతో స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తరచూ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అయితే, ఏం జరిగిందో ఏమో గానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో అజయ్ ప్రేమను ఆ అమ్మాయి నిరాకరించింది. దీంతో అజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
జులై 30న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అజయ్ను గుర్తించిన కుటుంబసభ్యులు అతడ్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు అజయ్. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జువైనల్ హోం నుంచి 10 మంది బాలురు పరార్
హైదరాబాద్ సైదాబాద్ జువైనల్ హోం నుంచి ఆదివారం 10 మంది బాలలు పరారయ్యారు. వెంటపడి నలుగురు బాలలను జువైనల్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. మరో ఆరుగురు బాలల తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తప్పించుకున్న బాలల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, తప్పించుకున్న వారంతా ఆపరేషన్ ముస్కాన్లో పోలీసులు రక్షించిన బాల కార్మికులని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులకు సైదాబాద్ బాలుర గృహం ఫిర్యాదు చేయలేదని తెలిసిందే.












Click it and Unblock the Notifications