హనీమూన్ వీసా కోసం వచ్చి.. ప్రాణాలొదిలిన నవ వరుడు
హైదరాబాద్: నగరంలోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. హనీమూన్ వీసా కోసం వచ్చిన ఓ నవ వరుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన శ్రీకాంత్ రెడ్డి(31)కి నవంబర్, 2015లో వివాహం జరిగింది. అతను తన భార్య, భావ అశ్విత్ రెడ్డి, చెల్లెలు అక్షయతో కలిసి హనీమూన్ ట్రిప్ వెళ్లేందుకు వీసా కోసం ఫిబ్రవరి 16న హైదరాబాద్ నగరానికి వచ్చారు.
పేట్ బషీరాబాద్ సమీపంలోని వీఎస్ఎస్ నందదీప్ అపార్ట్మెంట్లో బస చేశారు. గురువారం ఉదయం అపార్ట్మెంట్ నుంచి కిందకు దిగుతున్న శ్రీకాంత్ రెడ్డి ప్రమాదవశాత్తు కాలుజారి 5వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు.
తీవ్రగాయాలు కావడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.