MMTS రైలులో అత్యాచారం కేసులో సంచలన ట్విస్ట్
తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసలు ఆ యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని పోలీసుల విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్ స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.
ఇక ఈ విషయం బయటకు రావడంతో ఆ యువతిపై మండిపడుతున్నారు ప్రజలు. అరెస్టయిన ఆ యువకుడి పరిస్థితేంటి అని ఆగ్రహిస్తున్నారు. ఆడదానివేనా నువ్ అసలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పురుషులకు రక్షణ కల్పించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిలు కంప్లయింట్ ఇస్తే చాలా.. విచారణ చేయరా అని మరికొందరు మండిపడుతున్నారు.
ఏం జరిగింది..?
యువతిపై MMTS రైలులో అత్యాచారయత్నం కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. మేడ్చల్లోని ఓ వసతి గృహంలో ఉంటున్న యువతి ఫోన్ రిపేర్ కోసం.. సికింద్రాబాద్ వచ్చింది. తన ఫోన్ రిపేర్ అవ్వగానే తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకుని రాత్రి 7.30గంటల ప్రాంతంలో తెల్లాపూర్ - మేడ్చల్ MMTS లో మహిళల కోచ్లో ఎక్కింది.

అయితే.. బోగీలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక వాంఛ తీర్చాలంటూ ఓ ఆగంతకుడు యువతి దగ్గరకు వెళ్లి శరీరాన్ని తాకుతూ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో యువతి భయపడి రైలులోనుంచి బయటకు దూకేసింది. తీవ్రగాయాలతో పట్టాలపై పడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు.. 108 డయల్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా విచారణలో అసలు తనపై అలాంటి అత్యాచారయత్నం జరగలేదని ఆ యువతి చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు.
ఆ యవతి మొదట చెప్పింది కట్టుకథలేనని పోలీసులకు ఓ వైపు అనుమానం వస్తూనే ఉంది. దీంతో ఈ కేసులో లోతుగా విచారించారు. దాదాపు 250 సీసీ కెమెరాలను పరిశీలించామని, 100 మంది సాక్షులను విచారించామని అయినా ఎలాంటి ఆధారం దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో ఆ యువతిని మరోసారి విచారించగా ఈ షాకింగ్ విషయం చెప్పిందని అన్నారు.












Click it and Unblock the Notifications