చెన్నైలో ర్యాగింగ్: హైదరాబాద్లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రభుత్వాలు, పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ర్యాగింగ్ భూతం జూనియర్ విద్యార్థులను పీడిస్తూనే ఉంది. తాజాగా, ర్యాగింగ్ కారణంగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బలయ్యాడు. నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటరోడ్డులోని అల్లాపూర్ సొసైటీలో నివాసం ఉండే నరసింహాలాల్బాబు కుమారుడు వెంకటకృష్ణ చైతన్య(19) చెన్నైలోని సత్యభామ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

రెండు రోజుల క్రితం నగరంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. గురువారం రాత్రి ఇంట్లో తన బెడ్రూం తలుపులు మూసుకుని ఎంతకూ తెరవలేదు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి గది తలుపు తెరిచేలోగా అక్కడే ఉన్న సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాను చదివే కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్నోట్ రాసి కృష్ణచైతన్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఆ సీనియర్లను వదలొద్దు: సూసైడ్ నోట్లో వెంకటకృష్ణ
సీనియర్ విద్యార్థులు పూర్ణ చంద్రశేఖర్, ప్రకాశ్, సూర్యలే తన ఆత్మహత్యకు కారణమని వెంకటకృష్ణ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
కాగా, తమ కుమారుడిపై గతంలో కూడా సీనియర్లు దాడి చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని వెంకటకృష్ణ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కుమారుడి ఏటిఎం నుంచి రూ. 15వేలు కూడా సీనియర్లు దోచుకున్నాని తండ్రి ఆరోపించారు. ఈ విషయాలను తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామని తమ కుమారుడ్ని సీనియర్లు బెదిరింపులకు గురి చేసినట్లు చెప్పారు.
తాము విజయవాడకు చెందిన వారమని సీనియర్లు బెదిరించినట్లు వెంకటకృష్ణ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలిపారు. సీనియర్ విద్యార్థి చంద్రశేఖర్ను మాత్రం వదిలిపెట్టొద్దని సూసైడ్ నోట్లో తన కుమారుడు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అమ్మానాన్న, అన్నయ్యల ప్రేమకోసమే హైదరాబాద్ వచ్చానని తెలిపాడని వెంకటకృష్ట తండ్రి తెలిపాడు.












Click it and Unblock the Notifications