సమయానికి సినిమా మొదలు కాలేదు - థియేటర్ కు భారీగా జరిమానా : ప్రేక్షకుడు ఆగ్రహిస్తే..!!
సినిమా ప్రేక్షకుడు ఫిర్యాదుతో ఒక థియేటర్ కు జరిమానా పడింది. చెప్పిన సమయానికి సినిమా ప్రదర్శించలేదంటూ ఒక ప్రేక్షకుడు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. ఫలితంగా ఆ థియేటర్ పైన ఏకంగా లక్షా పది వేల రూపాయాల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. 2019, జూన్ 22న హైదరాబాద్ కు చెందిన విజయగోపాల్ అనే వ్యక్తి 'గేమ్ ఓవర్' అనే సినిమాను వీక్షించేందుకు కాచిగూడలోని ఐనాక్స్కు వెళ్లారు. అయితే సినిమా టిక్కెట్పై ఉన్న సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4:30 గంటలకు ప్రదర్శించాలి.
15 నిమిషాల సమయం వేస్ట్ చేసారంటూ
కానీ ఐనాక్స్ యాజమాన్యం ప్రకటనలు వేసి సా.4:45 గంటలకు సినిమాను ప్రదర్శించింది. దాంతో 15 నిమిషాలు ప్రకటనలు వేసి తన టైం వేస్ట్ చేశారంటూ విజయ్ గోపాల్ థియేటర్ మేనేజర్కు ఫిర్యాదుచేశారు. వారు స్పందించకపోవడంతో... కంజ్యూమర్స్ ఫోరమ్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో లైసెన్సింగ్ అథారిటీ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ను అందులో చేర్చారు. అయితే, థియేటర్ యాజమాన్యం మాత్రం సినిమాస్ రెగ్యులేషన్ చట్టం 1955 ప్రకారం తాము ప్రకటనలు వేసినట్లు వివరణ ఇచ్చింది.
థియేటర్ పైన కేసు దాఖలు
ఆర్టికల్ 19(1)(2), (ఎ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు తమకు ఉందని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. దీనిని పరిశీలించిన జిల్లా వినియోగదారుల ఫోరం నిబంధనల ప్రకారం 5 నిమిషాలే ప్రకటనలు వేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 15 నిమిషాలు కమర్షియల్ యాడ్స్ వేయటం నిబంధనల కు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఐనాక్స్ సంస్థ వాదనను ఫోరం తోసి పుచ్చింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1970, రూల్ నెం. 41 ప్రకారం కేవలం నిమిషాలు మాత్రమే ప్రకటనలు చేసే హక్కు ఉందని పేర్కొంది.
థియేటర్ కు జరిమానా విధింపు
దాంతో కేసు వేసిన బాధితుడికి పరిహారంగా రూ.5వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ. 5వేలు చెల్లించాలని ఐనాక్స్ లీజర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఆదేశించింది. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లక్షరూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించింది. దీంతో..ఇప్పుడు ఈ కేసు పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సినిమా థియేటర్లతో ప్రకటన ప్రదర్శన పైన చట్టాలు ఏం చెబుతున్నాయి.. ప్రేక్షకులు ఏ సమయంలో ఫిర్యాదు చేసే అవకాశం ఉందనే చర్చలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.